ఏపీలో ' కమ్మ ' Vs ' కమ్మ ' ల పోరాటం.... ఎక్కడెక్కడ... ఎవరెవరు పోటీ..?
- అసెంబ్లీకి కూటమి నుంచి 36 మంది... వైసీపీ నుంచి 9 మంది కమ్మ నేతలు
- కూటమిలో పార్లమెంటుకు 5 కమ్మ... వైసీపీ నుంచి ఒక్క కేశినేని మాత్రమే..!
- కమ్మ సీట్లకు భారీగా కోత పెట్టేసిన జగన్
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఎన్నికల వేడీ మామూలుగా లేదు. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇక నియోజకవర్గాల వారీగా కులాలు, ఏ నియోజకవర్గంలో ఏ కులానికి చెందిన వారు పోటీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తారు ? అన్నది సహజంగానే ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయంగా కీలకంగా ఉండే కమ్మ సామాజిక వర్గం సహజంగానే ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.. ఎక్కడెక్కడ పోటీ చేస్తుందన్నది కీలకంగా ఉంటుంది. జగన్ రకరకాల ఈక్వేషన్లలో కమ్మ వర్గానికి సీట్లు కట్ చేసేస్తున్నారు. ఈ సారి జగన్ కేవలం 9 అసెంబ్లీ సీట్లే ఇవ్వగా... ఒక్క విజయవాడ పార్లమెంటు సీటు మాత్రమే కేటాయించింది.
ఇక మొత్తంగా 9 నియోజకవర్గాల్లో ఇటు కూటమి తరపున, అటు వైసీపీ తరపున రెండు వైపులా కమ్మలే పోటీ చేస్తున్నారు. అంటే ఈ 9 చోట్ల మాత్రం కమ్మ వారే విజయం సాధించనున్నారు. ఇందులో 8 అసెంబ్లీ, 1 పార్లమెంటు నియోజకవర్గం ఉన్నాయి. వైసీపీ అసెంబ్లీ సీట్ల పరంగా 9 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే.. కూటమి తరపున మొత్తంగా 36 మంది కమ్మ నేతలకు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. ఇక కమ్మ నేతలే పోటీ పడుతోన్న ఆ 9 నియోజకవర్గాలు ఏంటో చూద్దాం.
విజయవాడ పార్లమెంటు సీటు
- కేశినేని శివనాథ్ ( చిన్ని ) ( టీడీపీ) - కేశినేని శ్రీనివాస్ ( నాని) ( వైసీపీ )
విజయవాడ పార్లమెంటు సీటు నుంచి ఇద్దరూ సొంత అన్నదమ్ములే పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ తరపున గెలిచిన కేశినేని నాని పోటీ చేస్తుంటే.. టీడీపీ తరపున ఆయన సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచినా సొంత అన్నదమ్ములే పార్లమెంటుకు వెళ్లనున్నారు.
ఇక ఇరు వైపులా కమ్మలే పోటీ చేస్తోన్న అసెంబ్లీ సీట్లు ఇవి...
1) విశాఖ తూర్పు
వెలగపూడి రామకృష్ణ బాబు ( టీడీపీ) - ఎంవీవీ సత్యనారాయణ ( వైసీపీ)
విశాఖ తూర్పులో టీడీపీ గత మూడు ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టిన వెలగపూడి రామకృష్ణబాబునే పోటీలో దింపితే... వైసీపీ ఈ సారి ప్రయోగం చేసింది. ముందు బీసీలకు ఇవ్వాలని అనుకున్నా.. విశాఖ ఎంపీగా ఉన్న కమ్మ నేత ఎంవీవీ. సత్యనారాయణను బరిలోకి దింపింది. ఇక్కడ హోరాహోరీ పోరు ఉన్నా టీడీపీకీ స్వల్ప ఎడ్జ్ ఉందంటున్నారు.
2) దెందులూరు
చింతమనేని ప్రభాకర్ రావు ( టీడీపీ) - కొఠారు అబ్బయ్య చౌదరి ( వైసీపీ)
దెందులూరులో టీడీపీ మాస్ లీడర్, టైగర్ చింతమనేని ప్రభాకర్ వరుసగా నాలుగోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి రెండోసారి బరిలో ఉన్నారు. ఇద్దరూ కమ్మ నేతలే .. పాత ప్రత్యర్థులే.. ఈ సారి ఇక్కడ హోరాహోరీ సమరం జరగనుంది.
3) గుడివాడ
వెనిగండ్ల రాము ( టీడీపీ) - కొడాలి నాని ( వైసీపీ)
గుడివాడలో ఎప్పుడూ కమ్మల సమరమే ఉంటుంది. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నానికి వెనిగండ్ల రాము రూపంలో కొత్త ప్రత్యర్థి ఎదురయ్యారు. నానికి గతంలో ఎప్పుడూ లేనంత గట్టి పోటీ ఈ సారి ఉంది.
4) విజయవాడ తూర్పు
గద్దే రామ్మోహన్ ( టీడీపీ) - దేవినేని అవినాష్ ( వైసీపీ)
విజయవాడ తూర్పులో సీనియర్ నేత, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్తో వైసీపీ జూనియర్ దేవినేని అవినాష్ ఢీ కొట్టబోతున్నారు. ఇద్దరూ కమ్మ నేతలే. గద్దే ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఇక్కడ గెలిచి ఉన్నారు. అవినాష్ చట్టసభల్లో తొలి గెలుపు రుచి చూడాలని కసితో ఉన్నారు. హోరాహోరీ పోరు ఉన్నా ప్రస్తుతానికి గద్దేకు లైట్ ఎడ్జ్ ఉందంటున్నారు.
5) గన్నవరం
యార్లగడ్డ వెంకట్రావు ( టీడీపీ) - వల్లభనేని వంశీమోహన్ ( వైసీపీ)
గన్నవరంలో టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన వల్లభనేని వంశీ ఈ సారి వైసీపీ పోటీలో ఉంటే.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వంశీపై ఓడిన యార్లగడ్డ వెంకట్రావు ఈ సారి టీడీపీ అభ్యర్థిగా పోటీలు ఉన్నారు. పోటీ ఎలా ఉన్నా కూడా గెలుపు యార్లగడ్డే అన్న టాక్ నడుస్తోంది.
6) తెనాలి
నాదెండ్ల మనోహర్ (జనసేన) - అన్నాబత్తుని శివకుమార్ ( వైసీపీ)
కూటమి తరపున జనసేన కమ్మ నేత పోటీ పడుతోన్న సీటు తెనాలి. ఇక్కడ గతంలో రెండుసార్లు గెలిచిన నాదెండ్ల మనోహర్ ఈ సారి జనసేన నుంచి పోటీలో ఉంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యే శివకుమార్ వైసీపీ నుంచి మూడోసారి పోటీలో ఉన్నారు. కూటమి కలిసొస్తే ఇక్కడ మనోహర్ గెలుపు కష్టం కాదు.
7) వినుకొండ
జీవి. ఆంజనేయులు ( టీడీపీ) - బొల్లా బ్రహ్మనాయుడు ( వైసీపీ)
వినుకొండలో ఎప్పుడూ కమ్మల సమరమే నడుస్తుంది. పాత ప్రత్యర్థులు బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ నుంచి, జీవి ఆంజనేయులు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బొల్లాపై తీవ్ర ఆరోపణలు... జీవి కంటిన్యూగా జనాల్లో ఉండడం ఇవన్నీ ఈ సారి ఇక్కడ గెలుపు జీవీ వైపే చూపిస్తున్నాయి.
8) పెదకూరపాడు
భాష్యం ప్రవీణ్ ( టీడీపీ) - నంబూరు శంకర్రావు ( వైసీపీ)
ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ శంకర్రావు పోటీలో ఉంటే... టీడీపీ కొత్త నేత, యువకుడు భాష్యం ప్రవీణ్కు సీటు ఇచ్చింది. ఇక్కడ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు తప్పదు.
ఇక వైసీపీ 8 కమ్మలు ఉన్న చోట.. టీడీపీ నుంచి కూడా కమ్మలే ఉన్నారు. ఒక్క తెనాలిలో మాత్రం జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. అదనంగా వైసీపీ చీరాలలో కరణం వెంకటేష్కు సీటు ఇచ్చింది.