ప్రతి ఎన్నికకు పార్టీ మారి సీటు కొట్టేస్తోన్న లీడర్ ఏపీలో ఆ ఒక్కడే..!
- మూడు ఎన్నికల్లో మూడుసార్లు పార్టీ మారి పోటీ
- 2014లో కలిసిరాని టీడీపీ ఈ సారైనా గెలిపిస్తుందా..?
( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )
ఆ కుటుంబానికి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. నైతిక విలువలతో కూడిన రాజకీయం చేస్తారన్న పేరు ఉంది. ఆ ఇంటి గడప తొక్కిన వారికి భరోసా, ధైర్యం ఉంటాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సీనియర్ నేత ప్రతి ఎన్నికకు పార్టీ మారుతూ వస్తున్నారు. ప్రతి ఎన్నికకు పార్టీ మారుతూ ఎన్నికల్లో పోటీ చేయటం ఆయనకు అలవాటుగా మారింది. తాజా ఎన్నికలలో కూడా మరోసారి కండువా మార్చి పోటీకి దిగుతున్నారు. ఆయన ఎవరో కాదు ? ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి.
కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం రాజకీయం చేసి ఒంగోలు కేంద్రంగా పలు మార్లు ఎంపీగా గెలిచారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలు నుంచి 2004 - 2009 ఎన్నికలలో కాంగ్రెస్ ఎంపిగా వరుసగా విజయాలు సాధించిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలలో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి వైవి సుబ్బారెడ్డి చేతిలో 13వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ కండువా కప్పుకుని ఒంగోలు ఎంపీగా పోటీ చేసి రెండు లక్షల పై చిలుకు ఓట్ల భారీ తేడాతో టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావును ఓడించారు.
ఐదేళ్లపాటు ఆయన వైసీపీలో ఎంపీగా ఉన్న ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆయన చివరి వరకు వైసీపీ ఎంపీ టిక్కెట్ వస్తుందేమో అని ఎదురు చూసి ఆ సీటును చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ఇచ్చాక మళ్లీ తిరిగి టీడీపీలోకి వచ్చారు. వరుసగా పార్టీలు మారుతున్నా మాగుంటకు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ నేపథ్యంలో ఈ సారి అయినా గట్టెక్కు తారేమో ? చూడాలి.