మూడు సీట్లు మాదిగలకే... ఆ ఓట్లు టీడీపీకి వన్సైడేనా ?
- బాబు ఈక్వేషన్తో ఈ వర్గం ఏకపక్షంగా టీడీపీకి సపోర్ట్
- పార్టీ చరిత్రలో డేరింగ్ స్టెప్ ... వైసీపీ 2 మాల, 1 మాదిగ ఈక్వేషన్
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్లలో చంద్రబాబు ఈసారి డేరింగ్ నిర్ణయం తీసుకున్నారు. మాల సామాజిక వర్గం ఓట్లు పార్టీకి తక్కువగా పడతాయి అన్న అంచనాతో.. మాదిగ సామాజిక వర్గం ఓట్లను పూర్తిగా తన వైపునకు తిప్పుకునేందుకు కొవ్వూరు, చింతలపూడి, గోపాలపురం మూడు సీట్లలోను మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకే అవకాశం ఇచ్చారు. టీడీపీ ముందు నుంచి కొవ్వూరు, గోపాలపురం సీట్లు మాదిగ వర్గానికి.. చింతలపూడి.. మాలలకు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి కొవ్వూరు నుంచి గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు.. గోపాలపురం నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుతో పాటు.. చింతలపూడిలో ఎన్ఆర్ఐ సొంగా రోషన్ కుమార్కు అవకాశం ఇచ్చింది.
మాదిగ సామాజిక వర్గంలో ముందు నుంచి చంద్రబాబు టీడీపీ పట్ల కొంత సానుకూల అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో చంద్రబాబు డేరింగ్ స్టెప్ వేశారనే చెప్పాలి. ఇక వైసీపీ కొవ్వూరు, చింతలపూడి సీట్లను మాలలకు.. గోపాలపురం సీటును మాదిగ సామాజిక వర్గానికి కేటాయించింది. ఈ క్రమంలోనే కొవ్వూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న హోం మంత్రి తానేటి వనితను గోపాలపురంకు మార్చి.. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావును కొవ్వూరుకు మార్చారు. చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాను పక్కన పెట్టేసి.. ఆ స్థానంలో శాసనమండలి చైర్మన్ రాజు వియ్యంకుడు కంభం విజయరాజుకు అవకాశం ఇచ్చారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్ మూడు ఎన్నికలలోను రెండు మాల ఒక మాదిగ ఈక్వేషన్తో ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ మూడు సీట్లలో వైసీపీ భారీ మెజార్టీలతో గెలిచింది. ఈసారి ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థులు ముగ్గురు గెలిచేందుకు.. గట్టి పోటీ ఇచ్చేందుకు.. ఆపసోపాలు పడుతున్నారు. హోం మంత్రి తానేటి వనిత టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మద్దిపాటి వెంకట్రాజుకి పోటీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం అనుకూలంగా వస్తుందా అంటే ? డౌట్ గానే కనిపిస్తోంది. గోపాలపురంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న తలారిని జగన్ కొవ్వూరుకు మార్చారు.
విచిత్రం ఏంటంటే గత రెండు ఎన్నికల్లో గోపాలపురంలో పరస్పరం తలపడ్డ తలారి, ముప్పిడి ఇప్పుడు కొవ్వూరులో మళ్లీ పోటీ పడుతున్నారు. చింతలపూడిలో కాస్తో కూస్తో పట్టు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తుండటం వైసీపీకి మైనస్ గా మారింది. ఈసారి చింతలపూడి వైసీపీకి ఏమాత్రం ఈజీ కాదని.. ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.