రాజకీయ రుద్రమలు: ఈ మహిళలు 'మహారాణులు' అవుతారా..?
• మహబూబాబాద్ లో కవిత పాగా వేస్తుందా..
• మాజీ మంత్రిని సునిత ఎదుర్కోగలదా..
ఒకప్పుడు రాజకీయాలు అంటే మొత్తం పురుషులే కనపడేవారు. కానీ ప్రస్తుతం పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి. మహిళలు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది అసెంబ్లీ, పార్లమెంటులో వారి గళాన్ని కూడా వినిపించారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పార్లమెంటు ఎలక్షన్స్ లో ఆ ముగ్గురు మహిళా మణులు చాలా కీలకంగా మారారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీత మహేందర్ రెడ్డి, ఆత్రం సుగుణ, మాలోతు కవిత. మరి ఈసారి ఈ మహిళలు పార్లమెంటులో అడుగు పెడతారా.. వారి ప్రత్యర్థులు ఎవరు, గెలుపోటములు ఎలా ఉన్నాయి అనే వివరాలు చూద్దాం.
మల్కాజిగిరి సునీత :
దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్ గిరి. ఇక్కడ 38 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడి ఓటర్లు వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. అలాంటి మల్కాజ్ గిరి హైదరాబాదుకు గుండెకాయ లాంటిది. ఈ మల్కాజ్ గిరి ప్రాంతంలోనే ఎక్కువగా బిజినెస్ లు, వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇక అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండుసార్లు గెలిచింది. అయితే ఈసారి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. మరి ఆమె గెలుపు తీరాలకు వెళ్తుందా అనేది తెలుసుకుందాం. సునీత భర్త మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2006లో తెలుగుదేశం పార్టీ నుంచి జెడ్పిటిసిగా గెలిచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఎన్నికయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి 2014లో మరోసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గా ఎన్నికయింది. 2019లో నూతనంగా ఏర్పడిన వికారాబాద్ జిల్లా తొలి ప్రజాపరిషత్ జెడ్పీ చైర్ పర్సన్ గా మరోసారి ఎన్నికయింది.ఆ తర్వాత బీఆర్ఎస్ లో ఆమెకు కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చింది. చివరికి 2024 ఫిబ్రవరి 16వ తేదీన గాంధీభవన్ లో కాంగ్రెస్ లో చేరింది. దీంతో ఆమెకు మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ కట్టబెట్టారు. అలాంటి మల్కాజిగిరిలో ఈసారి ఆమెకు బలమైన అభ్యర్థులైనటువంటి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఎంతో రాజకీయ చతురత కలిగినటువంటి ఇద్దరు నేతలను ఎదుర్కోవడానికి సునితా లక్ష్మారెడ్డి చాలా చురుకుగా దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్న ఈ సీట్లో ఇప్పుడు కూడా కాంగ్రెస్ వస్తుందని ధీమాతో ఉన్నారు.అంతేకాకుండా స్వయాన సీఎం ఈ పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యారు కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమెను గెలిపించాలని చూస్తున్నారు. అంతేకాకుండా మహిళల ఓట్లు సునీత మహేందర్ రెడ్డికీ కలిసి వచ్చే మరో అంశం. అలాంటి సునీత అన్ని అంశాల్లో దూసుకుపోతుంది కానీ స్థానికురాలు కాదు అనే ఒక అంశం ఆమెకు మైనస్ గా మారిందని చెప్పవచ్చు.
ఆత్రం సుగుణ ఆదిలాబాద్ :
కాంగ్రెస్ ఈసారి ఆదిలాబాద్ లో విజయ ఢంకా మోగించాలని ఆదివాసి మహిళా టీచర్ అయినటువంటి ఆత్రం సుగుణాను పార్లమెంటు బరిలో దింపింది. ఈమె రాజకీయాలకు చాలా కొత్త. కానీ ఆదివాసి హక్కుల కోసం కొన్ని పర్యాయాల నుంచి పోరాడుతోంది. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. గత రెండు దశాబ్దాలుగా మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్)లో జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగింది. ముఖ్యంగా సుగుణ ఆదివాసుల రాజ్యాంగ హక్కుల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన చాలా ప్రదర్శనల్లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించింది. ఈమె టీచర్ అవ్వడం బయట ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం వల్ల ఆమెపై దాదాపు 50 పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఆదివాసి ఓట్లు ఎక్కువగా ఉండడం వల్ల 2019 ఎన్నికలకు ముందు ఆదివాసి మరియు లంబాడా గ్రూపుల మధ్య ఫైట్ జరిగింది. ఈ గ్రూపుల గొడవల్లో కూడా ఆత్రం సుగుణ పాలుపంచుకుంది. ఈ విధంగా ఆత్రం సుగుణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ఆదివాసీ హక్కుల కోసం పోరాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పోరాట పటిమను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం సీటు ఖరారు చేసింది. ఇక సుగుణపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆత్రం సక్కు పోటీ చేస్తున్నారు. అలాగే మరో సీనియర్ నాయకుడు బిజెపి నుంచి గోడం నగేష్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు సీనియర్ నాయకులను ఆత్రం సుగుణ ఎదుర్కొంటాను అంటోంది. తనదైన స్పీచ్ తో దూసుకుపోతోంది. అంతేకాకుండా మహిళా అభ్యర్థి కావడంతో మహిళల ఓట్లు ఈమెకు పడతాయని ఆశపడుతోంది. అలాగే తెలంగాణ మంచి గుర్తింపు ఉన్న మంత్రి సీతక్క కూడా సుగుణ తరుపున ప్రచారం సాగిస్తోంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుగుణ ఈసారి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
మహబూబాబాద్ కవిత :
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో పార్లమెంటు స్థానం మహబూబాబాద్. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున మహిళామణి మాలోతు కవిత బరిలో ఉన్నారు. ఈమెపై సీనియర్ నాయకులు మాజీ ఎంపీ బలరాం నాయక్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా, బిజెపి నుంచి సీతారాం నాయక్ పోటీ పడుతున్నారు. మరి ఈ ఇద్దరు పురుషుల మధ్య ఈ మహిళామణి విజయం సాధిస్తుందా అనేది చూద్దాం. చిన్న తండా నుంచి ఢిల్లీ దాకా ఎదిగారు. 2019లో గెలిచిన 17 మంది ఎంపీల్లో మహిళ ఎంపీగా గెలిచింది మాలోతు కవిత ఒకరే. 1981లో మరిపెడ మండలంలో జన్మించారు. ఈమె సీనియర్ రాజకీయనేత రెడ్యానాయక్ కూతురు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి మాలోత్ కవిత తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ప్రత్యక్ష పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కాంగ్రెస్ నుంచి 2009లో మహబూబాబాద్ శాసనసభ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటి ఎంపీగా గెలుపొందారు. ఈ విధంగా తన పార్లమెంటు పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎంతో వాక్చాతుర్యం కలిగినటువంటి ఈ మహిళా మణి ఈసారి కూడా గెలిచే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.