చంద్రబాబు Vs జగన్: వ్యవసాయం - రైతులు... ఎక్కువ మేలు ఎవరు చేశారంటే..!
- పెట్టుబడి సాయం కేంద్రం వాటా కోత పెట్టడం జగన్కు మైనస్సే
- పదేళ్లలో పెరిగిన పెట్టుబడి... గిట్టుబాటు ధరలు లేవు..
( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )
అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రప్రదేశ్కు వ్యవసాయం.. ప్రాణం వంటిది. గ్రామీణ ప్రాంతాలనే కాదు.. పట్టణ ప్రాంతాల్లోనూ.. సాగుకు ప్రాధాన్యం ఉంది. దీంతో రైతులు ఎప్పుడూ.. రాజకీయంగా ప్రాధన్యం సంతరించుకుంటూనే ఉన్నారు. ఈ విషయంలో పరిశీలిస్తే.. చంద్రబాబు హయాంలో రైతులకు ప్రాధా న్యం ఇచ్చారు. ఇవ్వలేదని చెప్పలేం. అయితే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ని మాత్రం నెరవేర్చ లేక పోయారనేది వాస్తవం.
2014 ఎన్నికలకు ముందు.. చంద్రబాబు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పారు. ఆ తర్వాత.. రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలను తాము మాఫీ చేస్తామన్నారు. కానీ, రూ.25 వేల వరకు ఇచ్చి చేతులు దులుపుకొ న్నారు. ఇదేసమయంలో సాగుకు సంబంధించిన కీలక ఎరువులు, పురుగు మందుల ధరలు పెంచినా పట్టించుకోలేదు. దీనికితోడు గిట్టుబాట ధరల విషయంలోనూ నాటి బాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేసమయంలో కేంద్రం ఇచ్చిన భరోసా తప్ప.. రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా అందింది ఏమీ కనిపించలేదు.
ఇది చంద్రబాబుకు మైనస్ అయింది. ఫలితంగా రైతుకు-చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇక, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. పెట్టుబడి సాయం కింద రూ.13500 ఇస్తామని చెప్పారు. అయితే.. దీనిలో కేంద్రం ఇచ్చే రూ.6000లను పక్కన పెట్టి.. మిగిలిన మొత్తాన్ని మాత్రమే అందించారు. ఇది కొంత ప్రభుత్వానికి మైనస్ అయింది. ఇక, ఎరువులు.. పురుగు మందుల విషయంలో సహాయ సహకారాలు.. ఎప్పటికప్పుడు సూచనలు చేసేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇదొక సంచలన నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ప్రతి మండలానికి నాలుగు చొప్పున రైతు భరోసాకేంద్రాలు లేవు. రేపు ఏ ప్రభుత్వమొచ్చినా.. వీటిని అమలు చేయాల్సిందే.. అనే రీతిలో ఇవి రైతులతో కనెక్ట్ అయ్యాయి. వీటి ద్వారా ధాన్యం ఇతర వ్యవసాయ ఉత్పత్తులను జగన్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని అనుకున్నా.. చంద్రబాబు కంటే జగన్ హయాంలో రైతులకు చాలానే మేళ్లు జరిగాయనేది వాస్తవం.