నాలుగో విడత ఎన్నిక.. బరిలో ఉన్న ప్రముఖ నేతలు వీళ్ళే..??
ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా, తెలంగాణలో 17 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ దశలో ఉత్తరప్రదేశ్ (UP)లో 13 నియోజకవర్గాలు, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ లలో ఒక్కొక్కటి 8, బీహార్ లో 5, జార్ఖండ్, ఒడిశా రెండింటిలో 4 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. జమ్ము కశ్మీర్లోని ఒక నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.
ఈ దశలో అనేక నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ పోటీలు ఉన్నాయి. యూపీలోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ సహా కీలక రాజకీయ ప్రముఖులు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో కృష్ణానగర్ నుంచి టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా, బహరంపూర్లో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నారు. బీహార్లోని బెగుసరాయ్లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, మరో కేంద్ర మంత్రి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా కుంతీ నుంచి పోటీ చేస్తున్నారు. అసన్సోల్లో నటుడు శత్రుఘ్న సిన్హాను టీఎంసీ రంగంలోకి దించింది.
ఏపీలో కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. నెల్లూరులో టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజు మధ్య గట్టి పోటీ నెలకొంది. విశాఖపట్నంలో వైస్సార్సీపీ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి, టీడీపీ నుంచి భరత్ పోటీ పడుతున్నారు, మాజీ ముఖ్యమంత్రి N కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వైస్సార్సీపీ PV మధుసూదన్ రెడ్డి కూడా ఈ పోటీలో ఉన్నారు.
తెలంగాణలోని హైదరాబాద్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవి లత మధ్య గట్టి పోటీ నెలకొంది. సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి దానా నాగేందర్పై బీజేపీ అభ్యర్థి జి.కిషన్రెడ్డి పోటీ చేస్తున్నారు. నిజామాబాద్లో బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి జీవన్రెడ్డి ఉన్నారు. కరీంనగర్లో తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్కుమార్, బీఆర్ఎస్ వినోద్ కుమార్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.