విజయవాడలో బీజేపీ సుజనా చౌదరి గెలుపుపై డౌట్ మొదలైంది...?
- ఓటేసేందుకు ఆసక్తి చూపని యువత, కొత్త ఓటరు
- మైనార్టీ ఓటర్ల ఎఫెక్ట్తో వైసీపీ ఆసీఫ్ గెలుపు ఖాయమేనా ?
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం బాగా తగ్గింది. తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కల ప్రకారం.. 66.46 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక, సెంట్రల్లో 72.96 శాతం, తూర్పు నియోజకవర్గంలో 71.33 శాతం పోలింగ్నమోదైంది. ఈ రెండు నియోజకవర్గాలతోనూ పోల్చితే.. విజయవాడ వెస్ట్లో 5 శాతం మేరకు పోలింగ్ తగ్గింది. గత ఎన్నికలతో పోల్చినా.. దాదాపు ఇంతే ఉంది. అంటే..పోలింగ్ శాతం తగ్గింది.
ఇదే సమయంలో సైలెంట్ ఓటు పడిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో ఇక్కడ నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి, ప్రముఖ పారిశ్రామిక వేత్త సుజనా చౌదరి డీలా పడ్డారని తెలుస్తోంది. ఎందుకంటే.. ఓటింగ్ శాతం పెరిగి ఉంటే.. అది తనకు అనుకూలంగా ఉంటుందని ఆయన ఆది నుంచి లెక్కలు వేసుకున్నారు. అందుకే సంప్రదాయ ఓటర్లను పక్కన పెట్టి.. కొత్త ఓటర్లు.. ఓటింగుకు దూరంగా ఉన్న మధ్యతరగతి వర్గాలను ఆయన చేరువ చేసుకున్నారు.
కానీ.. ప్రస్తుతం నమోదైన పోలింగ్ను చూస్తే.. సంప్రదాయ ఓటరు మాత్రమే ఓటేసినట్టు స్పష్టమవుతోం ది. ఈ రూపంలో చూసుకుంటే.. పశ్చిమలో సంప్రదాయ ఓటర్లుగా ఉన్న మైనారిటీ వర్గాలు క్యూలైన్లలో ఎక్కువగా కనిపించారు. ఇతర సామాజిక వర్గాలు తక్కువగా కనిపించారు. ఇక, యువత పెద్దగా రాలేదు. ఈ పరిణామం.. సుజనాకు మైనస్ అవుతుందని లెక్కలు వస్తున్నాయి. ఇదేసమయంలో ఆసిఫ్కు మెరుగ్గా.. మైనారిటీ వర్గం నిలిచిందనే అంచనాలు వస్తున్నాయి.
గత ఎన్నికలను గమనించినా.. మైనారిటీ వర్గం నుంచి మహిళ ఖతూన్ పోటీ చేశారు. ఆమె ను తొలుత వ్యతిరేకించినా.. చివరకు మైనారిటీలంతా ఏకమయ్యారు. ఆమెకు బలమైన ఓట్లు వచ్చాయి. ఓడిపోయి నా.. మరీ ఘోరం అయితే కాదు. ఇప్పుడు కూడా.. మైనారిటీ ఓట్లు .. ఆ వర్గానికే పడి ఉంటాయని చెబుతున్నారు. పైగా.. టీడీపీలో ఉన్న జలీల్ ఖాన్పై ఈ సారి ఒత్తిడి తీవ్రంగా వచ్చింది.
బీజేపీకి ఎలా మద్దతిస్తారని ఆయనను మైనారిటీ వర్గాలు ప్రశ్నించడంతో ఆయన వారికి అనుకూలంగా.. మీ ఇష్టమే నా ఇష్టం` అని అనేసి మౌనంగా ఉండిపోయారు. దీంతో మైనారిటీ వర్గాలు ఆసిఫ్ వైపు నిలబడ్డాయని చెబుతున్నారు. అయితే.. ఇదంతా కూడా సైలెంట్ ఓటుగా సాగిపోయింది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.