టీడీపీ గెలవాలని వైసీపీ నేతల పూజలు.. లేటుగా బయటకొచ్చాయ్..?
- వైసీపీ టిక్కెట్ రాక... బిల్లులు లేక టీడీపీకి కోపరేషన్
- వైసీపీ బూచేపల్లి ఓడాలని.. టీడీపీ లక్ష్మి గెలవాలని ఇంట్లోనే ప్రత్యేక పూజ
( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )
కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగాను, ఆలోచింపజేసేవిగాను కూడా ఉంటాయి. ఇలాంటి చిత్రమైన విషయమే తాజాగా వెలుగు చూసింది. అయితే.. ఒకింత ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. ఇక, వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరూ తక్కువగా తీసేసే నాయకులు ఎవరూ కాదు.
సీనియర్ నాయకుడు బూచేపల్లికి, కొత్తగా అరంగేట్రం చేసిన లక్ష్మికి కూడా రాజకీయంగా కుటుంబ పరం గా చూస్తే.. మంచి సంబంధాలు.. ప్రజలతో గట్టి అనుబంధం కూడా ఉంది. వీరిద్దరూ గట్టి పోటీనే ఇచ్చా రు. దీనికితోడు రాష్ట్రంలోనే ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగి 90.91 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ చిత్రమైన వ్యవహారం ఒకటి తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ నేతలు గెలవాలని కోరుకుంటారు.
ఎక్కడైనా బద్ధ వ్యతిరేకులు ఉంటే తప్ప.. అందరూ సవ్యంగా తమ నాయకులు గెలుపు గుర్రం ఎక్కాలని కూడా అభిలషిస్తారు. కానీ.. వైసీపీలోనే ఉన్న కీలక నేత ఒకరు.. టీడీపీ కోసం అంతర్గతంగా చక్రం తిప్పా రని అంటున్నారు స్థానికులు. గత రెండు రోజులుగా.. సదరు నేతపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఆయన ఎవరనేది అందరికీ తెలిసినా.. పేరు మాత్రం బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయనకు గతంలో టీడీపీలో మంచి అనుబంధం ఉంది.
ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో టికెట్ కూడా ఆశించారు. కానీ, దక్కలేదు. దీంతో వైసీపీలోనే ఉండిపోయారు. పైకి మాత్రం మౌనంగా ఉన్నా.. అంతర్గతంగా టీడీపీ గెలవాలని కోరుకున్నారని.. ఇంట్లోనే ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారని సమాచారం. దీనికి కారణం.. వైసీపీలో ఉన్న తనకు ప్రాధాన్యం లేకుండా పోవడం.. తమపనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడం.. నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం వంటి కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, ఈ విషయం తాడేపల్లి వరకు వెళ్లినట్టు సమాచారం. రేపు ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత.. ఈయన చేసిన పూజలు ఫలించి టీడీపీ కనుక గెలిస్తే.. ఈయనపై చర్యలకు వైసీపీ తెరవెనుక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా, గతంలోనూ ఈయన పూజలు చేయించి.. చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్న విషయం తెలిసిందే.