రాయలసీమలో రెడ్ల నే ఢీ కొట్టి గెలిచిన ' కేఈ ఫ్యామిలీ ' హిస్టరీ..!
- కేఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడి కూడా ఎంట్రీ
- పత్తికొండలో గెలిచి శ్యాంబాబు కేఈ వారసత్వాన్ని నిలబెట్టేనా ?
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
కేఈ ఫ్యామిలీ అంటేనే తెలుగు రాజకీయాల్లో తెలియని వారు ఉండరు. కేఈ మాదన్నతో ఈ ఫ్యామిలీ రాజకీయ చరిత్ర ప్రారంభమైంది. ఈడిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన 1938లోనే జిల్లా బోర్డు సభ్యుడు అయ్యారు. ఆ తర్వాత 1967లో కర్నూలు ఎమ్మెల్యేగా, 1972లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు కేఈ కృష్ణమూర్తి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన డోన్, పత్తికొండ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పలువురు ముఖ్యమంత్రుల ప్రభుత్వాలలో మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో కర్నూలు నుంచి టీడీపీ తరపున పార్లమెంటుకు పోటీ చేసి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్రెడ్డినే ఓడించారు.
2004లో కేఈ ప్రతాప్పై కోట్ల విజయ్ భాస్కర్రెడ్డి భార్య సుజాతమ్మ కేవలం 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. 2009 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి సుజాతమ్మ 4 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. పార్లమెంటుకు పోటీ చేసి మామను, అసెంబ్లీకి పోటీ చేసి సుజాతమ్మను ఓడించిన కేఈ రాయలసీమ.. ఇంకా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని రెండుసార్లు ఓడించిన రికార్డ్ సొంతం చేసుకున్నారు.
ఇక కేఈ సోదరుల్లో మరో సోదరుడు కేఈ ప్రభాకర్ పత్తికొండ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. మరో సోదరుడు కేఈ ప్రతాప్ డోన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక వీరి ఫ్యామిలీలో మూడో తరం వారసుడిగా కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు 2019 ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తొలి ప్రయత్నంలో సక్సెస్ కాని శ్యాంబాబుకు ఈ ఎన్నికలు కీలకం కావడంతో ప్రతిష్టాత్మకంగా పోరాటం చేశారు. మరి కేఈ ఫ్యామిలీ మూడో తరం వారసత్వాన్ని శ్యాంబాబు ఈ ఎన్నికల్లో గెలిచి ఎలా ? నిలబెడతాడో ? చూడాలి.