ఈ విషయంలో వైసీపీ - టీడీపీ క్యాండెట్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా...?
రాజకీయాలు వేరు.. రాజకీయ నేతలు వేరు. సిద్ధాంతాలు.. వేరు. లక్ష్యం మాత్రం అధికారమే. ఈ క్రమంలో నే ఏపీలో జరిగిన ఎన్నికలు ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ప్రచారం జరిగింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇదంతా ఒక రాజకీయం. తెరకు రెండోవైపున.. ఇలా ఖసురుకున్న విసురుకున్న నాయకులు.. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు మిలాఖత్ అయిపోయారు. ఇది అసలు సిసలు రాజకీయం.
అంటే.. సాధారణంగా ఒకప్పుడు.. ప్రత్యర్థి డబ్బులు పంచుతుంటే.. అక్కడే పోటీలో ఉన్న మరో అభ్యర్థి ఓర్చుకునే పరిస్థితి ఉండేది కాదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేసి.. పట్టించే కార్యక్రమానికి కంకణం కట్టుకుని.. మరీపనిచేసిన పరిస్థితి 2019లో అన్ని నియోజకవర్గాల్లోనూ కనిపించింది. అందుకే అప్పట్లో డబ్బుల పంపిణీ.. చాలా గుట్టుగా సాగిపోయింది. అయితే.. చిత్రంగా ఈ ఎన్నికల్లో మాత్రం నాయకులు చేతులు కలిపేశారు.. ఓటర్ల చేతులు పోటాపోటీగా తడిపేశారు.
వైసీపీ నేతలు ఎంత పంచుతున్నారని.. టీడీపీ నాయకులు ఆరా తీశారు. వారి కన్నా ఒక రూపాయి ఎక్కువ పంచేందుకు ప్రయత్నించారు.ఇక, టీడీపీ నేతలు ఎంత ఇస్తున్నారోతెలుసుకుని..అంతకన్నా రూపాయి ఎక్కువగా వైసీపీ నేతలు పంచారు. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంటూరులో అయితే.. వైసీపీ , టీడీపీ నేతలు.. రెండేసి దఫాలుగా పంపకాలు చేపట్టారు.
ఎందుకంటే.. ఏమో పొరుగు పార్టీ తమ కంటే ఎక్కువ ఇస్తోందని భావించారు. దీంతో ఓటర్ల పంట పండింది. మరి ఈ పంచిన వారి పరిస్థితి ఏంటి? అంటే.. చెమటలు పట్టే ఉత్కంఠతో తర్జన భర్జన పడుతున్నారు. మొత్తానికి పంపకాల విషయంలో చివరి మూడు రోజులు నాయకులు కలిసి పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న కీలక వ్యవహారం.