జగన్ సైన్యం: సీఎంకు కష్టం వస్తే చాలు కాపు కాచే కల్లం ..!
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్
- సీఎంకు.. పాలనకు మధ్య సమన్వయకర్త
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
ఏపీ ప్రభుత్వంలో 42 మంది సలహాదారులు ఉన్నారు. అయితే.. వీరంతా ఏం చేస్తున్నారనే విషయాన్ని పక్కన పెడితే.. ఒకరిద్దరు మాత్రం మీడియా ముందుకు వస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో మాజీ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం రెడ్డి. ఐఏఎస్గా రిటైరైన తర్వాత.. ఆయనను జగన్ తన సలహాదారుగా నియమిం చుకున్నారు. ఈయన నేరుగా ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారు. కల్లం రెడ్డిది సెపరేటు స్టయిల్. సీఎం జగన్కు కష్టం వచ్చిన ప్రతిసారీ.. ఆయన మీడియా ముందుకు వచ్చేవారు.
తాజా ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం పెద్ద దుమారం రేపింది. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే.. మీ భూములు లాగేసుకుంటాడని.. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీనికి ప్రభుత్వం వైపు నుంచి పలువురు వివరణ ఇచ్చినా.. బలంగా ప్రజల్లోకి వెళ్లలేదు. ఇలాంటి సమయంలో విజయవాడలో పెద్ద సెమినార్నిర్వహించిన కల్లం రెడ్డి.. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్వాపరాలను వెల్లడించారు. దీనిని కేంద్రమే తీసుకు వచ్చిందని వివరించారు.
అలాగే.. ఏడాది కిందట.. జగన్ సర్కారు.. జీవో 1ని తీసుకువచ్చింది. దీనిపైనా దుమారం రేగింది. అయి తే.. అజేయకల్లం మీడియా ముందుకు వచ్చి.. ఈ జీవోను తీసుకురావాల్సిన అవసరం ఏంటో వివరించారు. అయితే.. తర్వాత.. దీనిని హైకోర్టు కొట్టేసింది. ఇక, వలంటీర్ల వ్యవహారం కాక రేపినప్పుడు కూడా.. కల్లం తనదైన వివరణతో వలంటీర్ల వ్యవస్థ అవసరాన్ని వివరించారు. అంతేకాదు. వలంటీర్ల వ్యవస్తను కొనసాగించక తప్పదని కూడా వివరించారు.
ఇతర సలహాదారుల మాదిరిగా కాకుండా.. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. అజేయ కల్లం ముందుంటారు. అటు ముఖ్యమంత్రితోనూ.. ఇటు ప్రభుత్వ పాలనతోనూ ఆయన టచ్లో ఉంటారు. సమకాలీన అంశాలపై ఎప్పుడు ఏ అవసరం వచ్చినా... ఆయన స్పందిస్తారు. తద్వారా ఆయన సర్కారు సమస్యలను కొంత వరకు పరిష్కరించే ప్రయత్నం అయితే చేశారు. నేరుగా సీఎంను కలిసే సలహాదారుల్లో ఈయన ఒకరు కావడం గమనార్హం.