జగన్ సైన్యం : మీడియా నుంచి సర్కారు వైపు.. ఆర్. ధనుంజయరెడ్డి జగన్ నమ్మిన హీరో..!
* గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ సక్సెస్లో కీలకం
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
ఆర్. ధనుంజయరెడ్డి. ఈయన గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అయితే.. వైసీపీలో గత ఐదేళ్లుగా కీలక రోల్ పోషించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వలంటీర్ వ్యవస్థ, గ్రామ, మండల, నగర సచివాలయ వ్యస్థలను తనదైన శైలిలో నడిపించిన ఘనతను కూడా ధనుంజయరెడ్డి సొంతం చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు కూడా.. 2020 వరకు ఈయన సాక్షి పత్రిక ఎడ్యుకేషన్ విభాగంలో ఎడిటర్గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత.. సెంట్రల్ డెస్క్ ఎడిటర్గా రెసిడెంట్ ఎడిటర్గా కూడా పనిచేశారు.
తనదైన రీతిలో ఆయా విభాగాలను నాణ్యంగా తీర్చిదిద్దడంలోనూ.. ఈనాడు వంటి ప్రధాన పత్రికలతో పోటీ పడేలా.. అంతకు మించి అన్నరీతిలో సాక్షిని పరుగులు పెట్టించడంలోనూ ధనుంజయ్ రెడ్డి కీలక రోల్ పోషించారు. ముఖ్యంగా ఉద్యోగులకు ఫ్రెండ్లీ అధికారిగా ఆయన ఉండేవారని అంటారు. దీనికి ముందు.. ధనుంజయ్ రెడ్డి ఈనాడులో నూ పనిచేశారు. సీఎం జగన్ సతీమణి భారతికి సమీప బంధువు కావడంతో సాక్షి ఆవిర్భవించిన తర్వాత.. ఈనాడు నుంచి సాక్షిలోకి వచ్చారు.
ఇక్కడ చేసిన సేవలను సీఎం జగన్ అనతికాలంలోనే గుర్తించి.. తర్వాత.. ప్రభుత్వంలోకి తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన సీఎం జగన్.. వీటిని ఆర్ . ధనుంజయ్రెడ్డిని గౌరవ సలహాదారుగా నియమించుకున్నారు. ఈయన వచ్చిన తర్వాత.. వలంటీర్ల స్వరూపం పూర్తిగా మారింది. వారిని నిత్యం మానిటరింగ్ చేస్తూ.. ప్రజలకు మరింత చేరువ చేశారు. దీంతో కేవలంరెండేళ్లలోనే వలంటీర్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించారు.
దీంతో పాటు.. స్వతంత్రంగా ఆయన నెటి ఎడిషన్ను కూడా.. ప్రారంభించారు. ఆన్లైన్లో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు, ప్రభుత్వం పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆన్లైన్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని ఆయన పత్రికను నడిపించారు. ఇలా.. పూర్తిస్థాయిలో అటు సర్కారుకు, ఇటు సీఎం జగన్కు వ్యక్తిగతంగా కూడా.. ధనుంజయ్ రెడ్డి సేవలు అందించడం గమనార్హం.