టీడీపీ ఓడితే... పార్టీ విలీనం చేసేస్తారా...?
- 2024లోనూ ఓడితే పార్టీ చాలా వరకు ఖాళీ
- పసుపు కేడర్కు నమ్మకం ఉండదు.. పార్టీ విలీనమే గతి...?
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ.. ఇప్పుడు కీలక దశలో ఉంది. 40 ఏళ్ల చరిత్ర లో ఎన్నడూలేని విధంగా టీడీపీ పెద్ద సవాళ్లను గత ఐదేళ్ల కాలంలో ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పార్టీని నడిపించేందుకు.. కార్యకర్తలను, నేతలనుసమన్వయం చేసేందుకు కూడా.. టీడీపీ అధినేత చంద్రబాబు నానా అగచాట్లు పడ్డారు. గత ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. నలుగురు ప్రత్యక్షంగా వైసీపీలోకి వెళ్లిపోయారు. మిగిలిన వారిలో మరో 10 మంది వరకు కేసులు ఎదుర్కొన్నారు.
ఒకానొక దశలో అసలు పార్టీ ఉంటుందా? ఊడుతుందా? అనే సందేహాలు కూడా తెరమీదికి వచ్చాయి. చంద్రబాబు వంటి కీలక నాయకుడు జైల్లో ఉన్నప్పుడు..ఇక పార్టీ పరిస్థితి అయిపోయిందనే వాదన విని పించింది. అదేసమయంలో సీనియర్ల ఆధిపత్య ధోరణితో అనంతపురం జిల్లాలో పార్టీ కొన్నాళ్ల పాటు చచ్చుబడిపోయింది. ఇక, ఆగడాలు.. రగడలతో కర్నూలులో పార్టీ పరిస్థితి నిత్యం సంక్షోభంలోనే సాగింది. అదేసమయంలో నాయకుల సుప్తచేతనావస్థ.. ప్రభుత్వానికి భయపడిన ఫలితంగా.. పలు జిల్లాలలో పార్టీ కార్యక్రమాలు కూడా ముందుకు సాగలేదు.
ఇలా.. ఐదేళ్ల పాటు నిత్యం ఒక సవాలు.. నిత్యం అనేక సమస్యలతో పార్టీ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ గెలవాల్సిన అవసరం ఉందనేది అందరి అభిప్రాయం. ఇలా గెలిచినప్పుడే పార్టీ మరోసారి బతికి పూర్వ వైభవం తెచ్చుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు కనుక ఓడితే.. ఇక, పార్టీమనుగడ దాదాపు ప్రశ్నార్థకమేనని చెబుతున్నారు పరిశీలకులు. వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు వయసు రీత్యా పెద్దవారు కావడంతో.. ఇప్పుడున్నచైతన్యంతో ఆయన అన్ని జిల్లాలు పర్యటించే అవకాశం మున్ముందు ఉండకపోవచ్చు.
నారా లోకేష్ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో స్వకరించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కీలక నేతలు పార్టీకే రాంరాం చెప్పినా ఆశ్చర్యంలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలు కొరవడి.. పార్టీ ముందుకు సాగక.. నానా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి రావడం కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇదే సమయంలో పార్టీని విలీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగినా జరగొచ్చు. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు కనుక పార్టీ విజయం సాధించకపోతే.. ఇకపై పార్టీ మనుగడ సాగించడం ప్రశ్నగానే మారనుంది. సో.. ఇదీ సంగతి.. !!