మన హైదరాబాద్: అధికారిక బంధం తెగినా.. బాంధవ్య బంధం గట్టిదే బ్రో..!
- వ్యాపార, కుటుంబ బంధాలు చెక్కు చెదరవ్
- ఎప్పటకీ మన హైదరాబాదే అన్న ఫీలింగ్
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్తో ఏపీకి జూన్ 2వ తేదీతో బంధం తెగిపోతుంది. విభజన చట్టంతో ప్రత్యేకంగా పేర్కొన్న హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధాని అనే విషయం ఆ రోజుతో ముగిసిపోతుంది. అంటే.. టెక్నికల్గా హైదరాబాద్ నగరం.. కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కానుంది. అయితే.. బాంధవ్యం పరంగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ ఏపీ ప్రజలకు తల్లితో ఉండే బొడ్డు బంధం వంటిదే. ఎందుకంటే.. వ్యాపారాలు.. కుటుంబాలు అలా పెనవేసుకున్నాయి.
ఉదాహరణకు హైదరాబాద్ కుటుంబాలతో వియ్యం అందుకున్నవారు తూర్పు, పశ్చిమ గోదావరులు.. విజయవా డ గుంటూరు నగరాలకు చెందిన వారు ఉన్నారు. దీంతో అక్కడి బంధం కొనసాగుతుంది. ఇక, ఏపీలోని కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన అనేక వ్యాపారులు హైదరాబాద్లో ఉన్నారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణల్లో వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. వీరితోనూ బంధం మరింత పెరుగుతుందనే చెప్పాలి.
అదే సమయంలో విద్యార్థులు కూడా.. ఉస్మానియా సహా నల్సార్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా కూడా పెరుగుతున్నారే తప్ప.. తరగడం లేదు. అదేసమయంలో అనేక సంస్థలు స్థాపించిన వారు కూడా.. ఏపీ వారు హైదరాబాద్లో ఉన్నారు. సో.. ఉమ్మడి రాజధాని లేకపోయినంత మాత్రాన వారేమీ హైదరాబాద్తో బంధం సంబంధం తెంచుకునే పరిస్థితి ఉండదు. చిత్రం ఏంటంటే.. ఏపీకి చెందిన సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబులకు కూడా.. హైదరాబాద్తో వ్యాపార సంబంధాలు ఉన్నాయి.
దీంతో ఆయా వ్యాపార సంబంధాలు.. కుటుంబ బంధాలు చెక్కచెదరవు. అయితే.. మరో 50 ఏళ్ల తర్వాత పరిస్థితులను మాత్రం ఇప్పుడు అంచనా వేయలేం. ఏపీలో హైదరాబాద్ను తలదన్నే రాజధాని. పెట్టుబడులు వస్తే.. ప్రతిష్టాత్మక యూనివర్సిటు ఏర్పాటు అయితే.. మరింత గా అభివృధ్ధి సాకారం అయితే.. అప్పుడు మాత్రమే హైదరాబాద్తో కొంత మేరకు దూరం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. లేకపోతే.. అప్పటి వరకు ఈ బంధం కొనసాగుతుందని చెబుతున్నారు.