కౌం ' ట్రిక్స్ ' : కౌంటింగ్ కేంద్రాల్లో తేడా ఎక్కడ జరుగుతుంది... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ ఆఫీసర్, అబ్జర్వర్
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
మరి కొన్ని గంటల్లోనే ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. అయితే.. ఈ ఓట్ల లెక్కింపు అంశంపై ఇటు వైసీపీ, అటు కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో ఏదో మతలబు జరుగుతుంద ని.. ఇరు పార్టీలూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అంతేకాదు.. ఎవరికి వారు తమ తమ ఏజెంట్లను కూడా అలెర్టు చేస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల్లో బలంగా కలబడాలని.. నిలబడాలని కూడా. . చెబుతున్నాయి. దీంతో అసలు కౌంటింగ్ కేంద్రాల్లో ఏం జరుగుతుంది? అసలు ఎందుకిలా పార్టీలు హడావుడి చేస్తున్నాయి? అనే చర్చ సాగుతోంది.
కౌంటింగ్ కేంద్రాల్లో జరిగే వ్యవహారాన్ని అధికారికంగా ఎన్నికల సంఘం వీడియో తీస్తుంది. దీనిని బయటకు ఇవ్వరు. దీనికి తోడు.. సీసీ టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. కేంద్రాల్లో ఏం జరిగినా.. తక్షణమే చర్యలు తీసుకునేలా ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి జరిగే అవకాశం తక్కువ. ఇక.. కౌంటింగ్ రోజున తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టిన అనంతరం ఈవీఎంల్లో ఓట్లు లెక్కిస్తారు. ప్రత్యేకంగా టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఇక, కౌంటింగ్ కేంద్రాల్లో పోటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల తరఫు ఏజెంట్లను అనుమతిస్తారు. వీరు ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిశితంగా గమనిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ ఆఫీసర్, అబ్జర్వర్ ఉంటారు. అలాగే, ఓ ఆర్వో, ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏజెంట్ ఉంటారు. అనంతరం 17C ఫాం వివరాలు అధికారులు చెప్పిన వాటితో సరి చూసుకోవాలి. ఫలితాలు వెల్లడవుతున్నప్పుడు పోలింగ్ తేదీ, పోలైన ఓట్లను సరి చూసుకోవాలి.
మీ దగ్గర ఉన్న 17C ఫాంలోని వివరాలు అక్కడ వాటితో తేడాగా ఉంటే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. ఫలితాలు వెల్లడి సమయంలో అభ్యర్థి వివరాలతో సహా అన్నీ నోట్ చేసుకుంటారు. అన్ని ఫలితాలను కూడా కౌంటింగ్ సూపర్వైజర్ కూడా నోట్ చేస్తారు. సో.. ఎ క్కడా కూడా కౌంటింగ్ కేంద్రాల్లో తేడా రాదు. ఏదైనా ఉద్దేశ పూర్వకంగా అలజడి సృష్టిస్తే తప్ప. ఇదే ఇప్పుడు పార్టీలకు అనుమానాలు పెంచుతోంది. మాచర్ల ఘటనలు రిపీట్ అవుతాయనేది పార్టీలకు ఉన్న అనుమానం.