చింతలపూడి : టీడీపీ ఎన్నారై సొంగా రోషన్ ఫ్యాన్ రెక్కలు విరిచి.. జబ్బ చరిచి అసెంబ్లీ ఎంట్రీ ఇస్తుండు..!
ఎన్నికలకు ముందు పరిణామాలు.. ఎన్నికల ప్రచారం పోలింగ్ సర్వే చూస్తే.. ఇక్కడ సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాని తప్పించి.. కంభం విజయరాజుకు అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా కొత్తగా ఎన్నారైగా ఉన్న సొంగా రోషన్ కుమార్ కు అవకాశం కల్పించింది. నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందు కచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న అంచనాలు ఎక్కువగా వినిపించాయి. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.
అయితే ప్రచారం ముగుస్తున్న కొద్ది టీడీపీ కాస్త వెనకబడింది. డబ్బు పంపిణీతో పాటు.. పోల్ మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీ వైఫల్యంతో సీను ఒక్కసారిగా మారిపోయింది. కచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది అన్న అంచనాల నుంచి.. హోరాహోరీ పోరు తప్పదేమో అన్న సందేహాలు చాలామందిలో కలిగాయి. అటు వైసీపీ.. ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు చింతలపూడిలో తమ పార్టీ గెలుస్తుంది అన్న ధీమా ప్రదర్శించే పరిస్థితి వచ్చేసింది.
అయితే ఫైనల్ గా ఈ రోజు జరిగిన కౌంటింగ్లో సొంగా రోషన్ కుమార్ ఏకంగా 26 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఎన్నారైగా వచ్చిన రోషన్ అదిరిపోయే గెలుపుతో చింతలపూడి అసెంబ్లీలో గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీపై అదిరిపోయే రివేంజ్ తీర్చుకున్నారనే చెప్పాలి. రోషన్ గెలుపు తో చింతలపూడి పార్టీ కేడర్లో సంబరాలు అయితే అంబరాన్నంటి పోయాయి.