పవనే ఏపీ 2024 పొలిటికల్ మ్యాచ్ విన్నర్...!
- జనసేన పవర్ తుఫాన్కు కొట్టుకుపోయిన వైసీపీ ఫ్యాన్ రెక్కలు
- మోదీతో బాబును కలిపిన పెద్ద మనిషి ఈ పవర్స్టార్
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
ఎస్ ఇది నిజంగానే నిజం... ఫలితాలు వెలువడే వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన ఏపీ 2024 ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యాచ్ విన్నర్ అయ్యారు. ఆయనకే ఈ ఎన్నికల మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వాలి. నిజంగానే పవనే చొరవ తీసుకుని ఎలాగైనా జగన్ను ఓడించాలని కసితో కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్నప్పుడు స్వయంగా అక్కడకు వెళ్లి ప్రెస్మీట్ పెట్టి బాబును పరామర్శించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి కడతాం... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయం అని సవాల్ చేశారు.
దీనిపై వైసీపీ వాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ను దత్తపుత్రుడు అంటూ దారుణంగా విమర్శించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా పవన్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఇక గత ఎన్నికల్లో గాజువాక, జనసేన రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈ సారి పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు కూడా వైసీపీ పవన్ను టార్గెట్ చేసింది. ఎలాగైనా పవన్ను ఓడించాలని కంకణం కట్టుకుంది. పవన్ ముందుగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు తమతో బీజేపీ కలిసి రావాలని చెప్పారు.
చంద్రబాబు - మోదీ మధ్య ఉన్న గ్యాప్ను కూడా పవన్ సరిచేశారు. ఈ విషయంలో తానే ముందుండి బాధ్యత తీసుకున్నారు. ఇక పిఠాపురంలో ఏకంగా 70 వేల పై చిలుకు భారీ మెజార్టీతో విజయం సాధించి సగర్వంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. చంద్రబాబు విజయానికి చాలా కారణాలే ఉండొచ్చు. కానీ మంచి మూమెంట్ ఇచ్చింది.. ఊపు ఇచ్చింది మాత్రం నూటికి నూరుశాతం పవన్ కళ్యాణే అని చెప్పాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏపీ సేఫ్గా ఉంటుందని జనసేన అభిమానులు ముందు నుంచి చెపుతూ వచ్చారు. జనసేన పార్టీ పవర్ తుఫాను అన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ఫ్రూవ్ అయ్యింది.