రాజానగరం : జనసేన ఊరమాసోడు వైసీపీ క్లాస్ రాజాను ఊదిపడేశాడు... ఎంపీటీసీ టు ఎమ్మెల్యే బత్తుల
గతంలో వైసీపీ ఎంపీటీసీగా ఉన్న బలరామకృష్ణ ఈసారి జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరోసారి బరిలో ఉన్నారు. రాజానగరం నియోజకవర్గంలో 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది. తొలి రెండు ఎన్నికలలో తెలుగుదేశం నుంచి గెలిచిన పెందుర్తి వెంకటేష్ కు ఈసారి సీటు ఇవ్వలేదు. నియోజకవర్గంలో రాజమండ్రి కార్పొరేషన్ లోని రెండు డివిజన్లతో పాటు రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాలు ఉన్నాయి.
కాపు సామాజిక వర్గానికి రాజకీయంగా మంచిపట్టు ఉన్న నియోజకవర్గం రాజానగరం. అలాగే సీతానగరం మండలంలో కమ్మ సామాజిక వర్గం కూడా తమ అధిపత్యం చాటుకుంటూ వస్తోంది. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు నుంచి కూడా నియోజకవర్గంలో బలరామకృష్ణ, రాజా మధ్య మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ.. మాటల తూటలు పేలిపోయాయి.. తీవ్ర పోటీ నడిచింది. నిజం చెప్పాలంటే నరాలు తెగే ఉత్కంఠ రేంజ్ లో ఇక్కడ జనసేన, వైసీపీ పోటీపడ్డాయి. ఎవరికి వారు గెలుపు ధీమా ప్రదర్శిస్తున్నారు. అంత ఫైట్ నడిచిన ఈ నియోజకవర్గంలో అంతిమ విజేతగా జనసేన బొత్తుల బలరామ కృష్ణే విజయం సాధించారు. ఏకంగా 34 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించి తిరుగులేని హీరో అయిపోయాడు.