నూజివీడు : జగన్ను కాదని బాబు చెంత చేరాడు.. సూపర్ విక్టరీ కొట్టేశాడు..!
నియోజకవర్గంలో నూజివీడు మున్సిపాలిటీ తో పాటు.. నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాలు ఉన్నాయి. చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదన్నమాట కాస్త పక్కన పెడితే.. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పై భారీ వ్యతిరేకత లేదు. ప్రతాప్ అప్పారావు లోకల్. ఇక పెనమలూరు నియోజకవర్గానికి చెందిన పార్థసారథి నూజివీడులో పోటీ చేయటం నాన్ లోకల్ అన్న ప్రచారం గట్టిగా వినిపించింది. చంద్రబాబు బీసీ అస్త్రం ప్రయోగించానని చెప్పిన 2014, 2019 ఎన్నికలలోను బీసీల్లోనే పార్థసారథి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు రెండుసార్లు సీటు ఇచ్చినా ఓడిపోయారు.
అయితే ఈసారి పార్థసారథి సీనియర్ నేత కావడం.. మాజీ మంత్రి కావడంతో పాటు.. కాస్త అనుభవం ఉండడంతో గట్టి పోటీ ఇచ్చారు. ఏలూరు పార్లమెంటు సీటు కూడా టీడీపీ బీసీలకు ఇవ్వడంతో.. ఇటు అసెంబ్లీ సీటు కూడా బీసీలకు ఇవ్వడం నేపథ్యంలో.. బీసీ ఫ్యాక్టర్ బాగా కలిసి వస్తుందని నమ్మకం పెట్టుకుంది. ప్రచారంతో పాటు పోలింగ్ సరళి... సర్వేల నేపథ్యంలో గట్టి పోటీ జరిగిందని వైసీపీకి ఆధిక్యత ఉంటుందన్న అంచనాలు ఎక్కువగా వినిపించాయి.
ఫైనల్గా అంతిమ విజేతగా పార్థసారథి నిలిచారు. 10 + వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఎట్టకేలకు 2009 తర్వాత నూజివీడులో టీడీపీ విజయం సాధించింది.