రివేంజ్ పాలిటిక్స్ చేసేవారు మట్టిలో కలిసిపోతారు జాగ్రత్త!
అవతల వారిని ఏదో చేద్దామనుకుని బరిలోకి దిగే వారు ఖచ్చితంగా మట్టిలో కలసిపోతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ కాలమే సమాధానం చెబుతుంది. ఈ నీతి సూత్రాన్ని వంటబట్టించుకుంటేనే ఎవరైనా పది కాలాల పాటు చల్లగా రాజకీయాలు చేసుకుంటారు... లేదంటే అంతే. ఇంకా లోతుగా వెళితే... పుష్కర కాలం కిందట కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉమ్మడి ఏపీలో తనకు బలం ఉందని భావించి అధికార గర్వంతో జగన్ ని జైలులో పెట్టించగా దాదాపు 16 నెలల పాటు జగన్ జైలులో ఉన్నారు. ఆ తరువాత జగన్ బయటకు వచ్చి తనదైన శైలిలో ఏపీలో కాంగ్రెస్ అన్న పార్టీయే లేకుండా తొక్కి పెట్టి జగన్ పైకి ఎదిగారు.
ఇక లేటెస్ట్ ఉదాహరణ తీసుకుంటే ఎన్నికలకు సరిగ్గా 6 నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయించి 53 రోజుల పాటు జైలులో ఉంచారు. కట్ చేస్తే చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తూనే రెట్టింపు బలంతో జనంలోకి వెళ్లారు. అదే ఎన్నికల్లో పూర్తిగా ఫలించి టీడీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని మెజారిటీలు సాధించాయి. జగన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలి వైసీపీ ఇపుడు భూస్థాపితం అయింది. రివెంజ్ పాలిటిక్స్ చేస్తే దక్కే ఫలితం ఇది అని మరోసారి రుజువు అయింది కదా. ఇలాంటి పరిణామాల తరువాత కూడా నేతలు ఎవరికి వారు ఆలోచించుకుంటే బావుంటుంది. తాజాగా టీడీపీ అధికార మదంతో వైసీపీ శ్రేణులపైన చేస్తున్న దాడులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయం ఇట్టే అవగతం అయిపోతుంది. ఇప్పటికైనా నేతలు అటువంటి చర్యలు మాని పూర్తిగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడితే జనాలకు మేలు చేసేవారు అవుతారు.