ఏపీకి ఓ దశ-దిశ.. నారా లోకేష్ ..!
- నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంలోనే గెలుపు
( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )
పార్టీ అంటే..నాయకుల సమాహారం. ఎక్కడ ఏ నాయకుడు ఇబ్బంది పడినా..అది మొత్తం పార్టీపై ప్రభావం చూపిస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ చతికిల పడడానికి నాయకుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. పైస్థాయిలో నాయకుడు తమ మాట వినలేదు కాబట్టే.. ఇప్పుడు ఓడిపోయామని.. కొట్టు సత్యనారాయణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి వంటి వారు చెప్పుకొచ్చారు. ఇది అక్షర సత్యం కూడా. అధికారంలోకి రాకముందు.. అందరూ నాయకులకు ప్రాధాన్యం ఇస్తారు.
కానీ, అధికారంలోకి వచ్చాక నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంలోనే అసలు విజయం దాగి ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ పూర్తిగా విఫలమయ్యారు. 2019లో ఆయన విజయానికి కారణమైన రెడ్డి సామాజిక వర్గాన్ని తృణీకరించారు. ఫలితంగా ఇప్పుడు అదే సామాజిక వర్గం దూరమైంది. అప్పట్లో జగన్ తో కలిసి అడుగులువేసిన నాయకులను ఆదరించారు. కానీ, అధికారంలోకి వచ్చాక.. తలుపులు బిగించుకుని కూర్చున్నారు. ఫలితం.. ఎలా ఉందో కనిపిస్తోంది.
కట్ చేస్తే.. టీడీపీలో భవిష్యత్తు నాయకుడిగా ఎదిగే నారా లోకేష్ ఈ రెండు ప్రతిబంధకాల నుంచి బయట కు రావాలి. ఒకళ్లు నాకు చెప్పేది ఏంటి? అనే స్వభావం కనుక ఉండి ఉంటే.. దానిని తక్షణం తీసి పక్కన పెట్టాలి. అన్ని వర్గాల నాయకులకు.. కులం, మతంతో సంబంధం లేకుండా.. ప్రాధాన్యం ఇవ్వాలి. పిలిస్తే.. పలుకుతాడనే విధంగా నాయకులకు చేరువ కావాలి. అప్పుడు నాయకుడిపై నాయకులకు నమ్మకం మరింత పెరుగుతుంది.
సమస్యలు కొన్ని దశాబ్దాల పాటు ఉండేవి. కానీ, నాయకులను మాత్రం దూరం చేసుకుంటే.. వారు కీలక సమయంలో ఉన్నట్టే ఉండి.. హ్యాండిచ్చే పరిస్తితి వస్తుంది. విషయంలో నార లోకేష్ వ్యూహాత్మకంగా వేసే ప్రతిఅడుగు కూడా.. కీలకమేనని చెప్పాలి. ప్రభుత్వంలో పాత్ర రావొచ్చు. కానీ, పార్టీలో పాత్రను దాని ప్రాధాన్యాన్ని మాత్రం తగ్గించుకుంటే.. వచ్చే భవిష్యత్తుకు ఇబ్బంది గోడలు పేర్చుకున్నట్టే అవుతుంది. సో.. ఈ నేపథ్యంలో నాయకులకు దశ-దిశగా మారి.. ముందుకు సాగితే.. భవిష్యత్తు బంగారపు పాన్పు అవుతుందనడంలో సందేహం లేదు.