చంద్రబాబు కేబినెట్.. సోషల్ ఇంజనీరింగ్ సూపరెహే..!
- ఫరూక్కు ఛాన్స్తో సీమ ముస్లింల్లో ఆదరణ
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
టీడీపీ అధినేత చంద్రబాబు తన కేబినెట్ కూర్పు విషయంలో అద్భుతాన్ని సృష్టించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు తన కేబినెట్లో మసాలాతోపాటు.. షడ్రశోపేతమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూర్చుకున్నారు. గతంలో జగన్కు మాత్రమే.. మంత్రి వర్గంలో సోషల్ ఇంజనీరింగ్ చేశారన్న పేరు ఉండగా.. ఈ సారి మాత్రం చంద్రబాబు ఆ మార్కును తాను సొంతం చేసుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. గతంలో చోటు దక్కించుకోని వారికి అవకాశం ఇచ్చారు.
విభజిత ఏపీలో తొలిసారి చంద్రబాబు కేబినెట్లో మైనారిటీ ముస్లిం నాయకుడికి అవకాశం చిక్కడం పెద్ద మేలు మలుపు. ఎవరూ ఊహించి కూడా ఉండని ఈ సీటును సీనియర్ నాయకుడు నస్యం మహమ్మద్ ఫరూక్ కు కట్టబెట్టారు. పైగా కర్నూలులో ముస్లింలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని చంద్రబాబు కొంత వరకు సపోర్టు చేసినట్టు అయింది. పైగా పార్టీలోనూ దశాబ్దాలుగా ఫరూక్ పనిచేస్తున్నారు. గతంలో ఆయనకు మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవిని అప్పగించిన విషయం తెలిసిందే.
అదేవిధంగా చంద్రబాబు తొలిసారి తన కేబినెట్ లో ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఐదేళ్లు పాలించినా ఎస్టీ సామాజిక వర్గానికి చంద్రబాబు అవకాశం ఇవ్వలేక పోయారు. ఇప్పుడు మాత్రం సాలూరు నుంచి విజయం దక్కించుకున్న గుమ్మడి సంధ్యారాణికి చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. ఇది కూడా ఎస్టీ సామాజిక వర్గం ఓట్లను టీడీపీ వైపు స్తిరంగా ఉంచేందుకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.
అలానే.. చంద్రబాబు తొలిసారి కురబ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఎప్పుడూ కూడా.. కురబ సామాజిక వర్గానికి చోటు ఇవ్వలేదు. ఇదే సమయంలో అనంతపురానికి చెందిన బోయ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాత్రం బలమైన బీసీ వర్గంగా ఉన్న కురబలను చేరదీయడం ద్వారా అనంతపురంలో వైసీపీని దెబ్బకొట్టే వ్యూహానికి ప్రాణం పోశారు. పెనుకొండ నుంచి విజయం దక్కించుకున్న సవితకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.