ఆనంకు మంత్రి పదవి వెనక ఆ ఇద్దరు మహిళలు ఉన్నారా..!
- సౌమ్యుడైన ఆనంతోనే నెల్లూరులో పార్టీ స్ట్రాంగ్ అయ్యేనా..!
- బాబు వ్యూహం ఇంత ఉందా...!
( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ )
ఆనం రామనారాయణ రెడ్డి తెలుగు రాజకీయాల్లో సీనియర్ నేత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆర్థికమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.. అలాగే ఫిరాయింపు రాజకీయాల్లోనూ ఆయనకు పెట్టింది పేరు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఆనం సోదరులు కొన్నేళ్ల పాటు నెల్లూరు రాజకీయాలను శాసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థికమంత్రిగా పనిచేసి ఆ పదవికి వన్నె తెచ్చిన ఆయన 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. వెంటనే చంద్రబాబు ఆయన్ను ఆత్మకూరు ఇన్చార్జ్గా నియమించారు. ఆనం ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఆశించినా బాబు ఇవ్వలేదు.
ఆనం అలిగారు.. ఎన్నికలకు ముందు చంద్రబాబును విమర్శించి జగన్ చెంత చేరిపోయారు. వెంకటగిరి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. సేమ్ జగన్ కేబినెట్లో ఖచ్చితంగా మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారు. రెండేళ్లకే అక్కడ తనకు ప్రాధాన్యత లేదన్నది ఆయనకు అర్థమైంది. రగిలిపోయాడు... చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి వైసీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.
ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీడీపీలో చేరిన ఆనం ఈ సారి వెంకటగిరి నుంచి కాకుండా ఆత్మకూరు లాంటి కష్టమైన సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి కోటాలోనే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి ఇలా చాలా మంది ఉన్నా వారిని కాదని ఆనంకే ఎందుకు మంత్రి పదవి ఇచ్చారంటే బాబు చాలా వ్యూహంతో ఆలోచించే చేశారని తెలుస్తోంది.
గత ఐదేళ్లలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి, అల్లుడు టీడీపీ కోసం బాగా కష్టపడి పనిచేశారు. వీరు లోకేష్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు. అసలు ఈ ఎన్నికల్లో ఆనం వెంకటగిరిలో, కైవల్యారెడ్డి ఆత్మకూరులో పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఆనంకే సీటు దక్కింది. ఇటు కైవల్యారెడ్డి దంపతులు పడిన కష్టం.. సీటు త్యాగం చేయడంతో పాటు.. అటు ఆనం వియ్యపురాలు కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే కునిరెడ్డి విజయమ్మ కూడా బద్వేలులో చాలా కష్టపడ్డారు.
ఈ సారి బద్వేలు సీటు టీడీపీకి ఇస్తే గెలిచి ఉండేదే.. అయితే ఇక్కడ ఐదేళ్ల పాటు మాజీ ఎమ్మెల్యేగా, ఇన్చార్జ్గా ఉన్న విజయమ్మ పార్టీని బలోపేతం చేస్తే.. చివర్లో ఈ సీటు బీజేపీకి ఇచ్చారు. వీరిద్దరు చేసిన త్యాగాల నేపథ్యంతో పాటు ఆనంకు ఇదే చివరి అవకాశం కావడం.. సౌమ్యుడు అయిన ఆయన నెల్లూరు జిల్లాలో అందరిని కలుపుకుని వెళుతూ పార్టీని స్ట్రాంగ్ చేస్తారన్న వ్యూహంతోనే బాబు ఆనంకు మంత్రి పదవి కట్టబెట్టారని క్లీయర్గా తెలుస్తోంది.