దటీజ్ రామానాయుడు... బాబు, లోకేష్ ఇద్దరి టీంలోనూ గేమ్ ఛేంజర్ ..!
- ప్రతిపక్షంలో జగన్నే ఆటాడుకున్న గట్స్న్నోడు
- హ్యాట్రిక్ విక్టరీతో మంత్రి
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
మినిస్టర్ నిమ్మల రామానాయుడు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో సంచలనం.. పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం గ్రామంలో నిమ్మల ధర్మారావు, రమావల్లి దంపతులకు రామానాయుడు జన్మించారు. రామానాయుడుకి భార్య సూర్య కుమారి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామానాయుడుకు ఈ రోజు బాబు కేబినెట్లో మంత్రి పదవి ఎందుకు వచ్చిందన్నది చూస్తే ఆయన జీవితం అంతా నిత్య పోరాటాలే కనిపిస్తాయి.
ఆయన ప్రాథమిక విద్య ఆగర్తిపాలెంలో, డిగ్రీ నర్సాపురం వైఎన్ కళాశాలలో చేశారు. 1992 లో ఎంఏ, 1995 లో ఎంఫిల్, 2005 లో పి.హెచ్.డి లు ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. యూనివర్సిటీలోనే విద్యార్ధి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేశారు. చదువుకుంటూనే సొంత వ్యవసాయం చూసుకునేవారు. నరసాపురం వైఎన్ కళాశాలలో లెక్చరర్ కొంత కాలం పని చేశారు. లెక్చరర్ సమస్యలపై పోరాటాలు చేశారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
2005లో తన తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించారు. తనకున్న 20 ఎకరాల్లో సగం ఆదాయాన్ని పేదలు, వృద్ధులు, వికలాంగులకు ప్రతినెల బియ్యం, నిత్యావసర వస్తువులు, మందుల కోసం ఖర్చు చేస్తున్నారు. పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారికి ఆర్థికంగా సాయ పడటం.. వస్తువుల పంపిణీ చేయండంలో ముందుంటారు. పాలకొల్లు మండలం ఆగర్రు సొసైటీ అధ్యక్షులుగా 8ఏళ్లు చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా ఇతర రైతువారీ సమస్యలపై పోరాడారు.
2012లో తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లు మండలం టిడిపి అధ్యక్షులుగా సమర్ధవంతంగా పనిచేసారు. రైతు సమస్యలపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేశారు. 2014లో పాలకొల్లు టిడిపి అభ్యర్థిగా పోటీచేసి 6383 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సుమారు రూ.600 కోట్లు నిధులు తెచ్చి పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. 2019లో రెండవసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో దిగారు. రాష్ట్రమంతా జగన్ గాలి వీచినా పాలకొల్లులో 18 వేల మెజారిటీ తో ఘన విజయం సాధించారు. వైసీపీ పాలనలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి కీలక నేతగా ఎదిగారు. మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి 67 వేల పైగా మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక రామానాయుడు అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఇద్దరికి అత్యంత ఇష్టుడిగా మారాడు. పార్టీ 2019లో ఘోరంగా ఓడినా ఘనవిజయం సాధించడం.. హ్యాట్రిక్ గెలుపు... దీనికి తోడు ప్రతిపక్షంలోనూ ప్రజాపోరాటాలు చేయడం.. జగన్పై అసెంబ్లీలో తీవ్రస్థాయిలో విరుచుకుపడడం.. కాపు సామాజిక వర్గంలో ఓ ఐకాన్ మాదిరిగా పార్టీకి ఉపయోగపడడం.. బలమైన వాగ్దాటి... ఇవన్నీ రామానాయుడును పార్టీలో తిరుగులేని హీరోను చేసి.. ఈ రోజు మంత్రిని చేశాయి.