ఐరన్ లెగ్గులు- ఈ పేరును వీరు నిలబెట్టుకున్నారే..!
- దేవినేని వారసుడికి హ్యాట్రిక్ పరాజయాలు
- ఇద్దరి పొలిటికల్ ఫ్యూచర్ గందరగోళమే..!
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
రాజకీయాల్లో నాయకులు వరుస విజయాల మాట ఎలా ఉన్నా.. ఆ నాయకుల వ్యవహార శైలితో పార్టీలు ఇబ్బందులు పడినప్పుడు సహజంగానే నాయకులకు ఐరన్ లెగ్ అనే పేరు సార్థకం అవుతుంది. గతంలో ఈ పేరు రోజాపై ఉండేది. అయితే.. ఆమె బాగా శ్రమించి..నగరి నుంచి విజయం అందుకున్నాక.. పోగొట్టు కున్నారు. కానీ, ఐరన్ లెగ్గులు అని పేరున్న ఇద్దరు నాయకులు మాత్రం మళ్లీ ఆ పేరును అలానే నిలబెట్టుకున్నారు. చిత్రం ఏంటంటే.. వీరు గెలవరు. అంతేకాదు.. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు కూడా.. అధికారం కోల్పోతాయి.
దీంతో వారికి రాజకీయాల్లో ఐరెన్ లెగ్గులు అనే పేరు నిలబడిపోయింది. వారే.. విజయవాడకు చెందిన యువ నాయకుడు.. దేవినేని అవినాష్. మరొకరు కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చెలమల శెట్టి సునీల్. ఇద్దరూ కూడా ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయారు. అంతేకాదు.. వారు ఉన్న పార్టీలు కూడా .. అధికారాలను కోల్పోయాయి. దీంతో ఇప్పుడు వీరిపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. దేవినేని అవినాష్. 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఓడిపోయి.. పార్టీ కూడా భూస్థాపితం అయిపోయింది.
2019లో టీడీపీ తరఫున గుడివాడ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ దేవినేని ఓడిపోవడమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహించిన టీడీపీ కూడా అధికారం కోల్పోయింది. ఇక, 2024లో వైసీపీ నుంచి విజయవాడ తూర్పు టికెట్పై పోటీ చేశారు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. అలానే జరిగింది. పైగా.. సర్కారు కూడా.. అధికారం కోల్పోయింది. దీంతో ఈయనకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చేసింది. ఓటమి గెలుపు అనేది ఎవరికైనా సహజమే అయినా..వరుసగా జరుగుతుండడంతో ఈ పేరు రావడం గమనార్హం.
ఇక, చెలమల శెట్టి సునీల్ .. గెలుపు అనేది తెలియని ఓటమి వీరుడుగా పేరు తెచ్చుకున్నారు. విడిచి పెట్టకుండా ఆయన కాకినాడ నుంచే పోటీ చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు ఇక, 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడారు. అప్పుడు కూడా ఆపార్టీ అధికారంలోకి రాలేదు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడారు. అప్పుడు టీడీపీ అధికారం కోల్పోయింది. ఇక, తాజా ఎన్నికల్లో మరోసారి వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. చిత్రంగా గెలుస్తుందని అనుకున్న వైసీపీ కూడా పరాజయం పాలైంది. ఇదీ.. సంగతి!!