యనమలకు అందుకే మంత్రి పదవి రాలేదా.. ?
- టీడీపీ కోటాలో గవర్నర్ గిరీ
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
తాజాగా ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వంలో అందరూ అనుకున్నది.. ఆసక్తిగా ఎదురు చూసిం దీ.. యనమల రామకృష్ణుడు. ఎందుకంటే.. చంద్రబాబు ఎక్కడ ఉంటే.. యనమల అక్కడే ఉంటారనే నానుడి ఉంది. ప్రజాక్షేత్రంలో గెలుపు - ఓటములతో ఆయనకు సంబంధం లేదు. చంద్రబాబుకు విధేయుడిగా ఉండడం.. రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ భవిష్యత్తును నిరంతరం పరిశీలిస్తుండడమే యనమలకు ఉన్న విజ్ఞత.. పని..!
ఈ నేపథ్యమే ఆయనను చంద్రబాబుకు చేరువ చేసింది. చంద్రబాబు దృష్టిలో ఒక కృషీవలుడిని చేసింది. అందుకే.. ఆయన ఓడిపోయినా.. అసలు ప్రజాక్షేత్రంలో పోటీ చేయకపోయినా.. పదవులు వరించాయి. 2014-19 మధ్య మాత్రమే కాదు.. అంతకు ముందు కూడా.. చంద్రబాబు యనమలను సగౌరవంగానే చూసుకున్నారు. స్పీకర్ పదవిని అప్పగించారు. మంత్రిని చేశారు. పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యత్వాన్ని కూడా ఇచ్చారు. కీలక నిర్ణయాలు తీసుకునేముందు.. యనమలకు చెప్పి చేయడం కూడా.. బాబుకు ఉన్న సూత్రం.
అలాంటి యనమలకు ఈ దఫా.. మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఆయన వచ్చేస్తారని.. ఆయన మంత్రి పీఠం ఖాయమని.. ఆర్థిక మంత్రి ఆయనేనని అందరూ అనుకున్నారు. దాదాపు అందరూ ఒక అంచనాకు కూడా వచ్చేశారు. కానీ, అనూహ్యంగా ఈ సారి చంద్రబాబు టీంలో యనమలకు చోటు దక్కలేదు. దీంతో అందరూ ఒక్కసారి గా ఆశ్చర్యపోయారు. పోనీ..ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారా? అంటే.. ఆయన ఎమ్మెల్యే కాదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగానే ఉన్నారు. అది కూడా.. రెండేళ్లే ఉంది.
దీంతో యనమల వ్యవహారం సహజంగానే ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ వర్గాల నుం చి అందుతున్న సమాచారం ప్రకారం.. యనమలకు గవర్నర్ గిరీ ఇప్పించనున్నట్టు తెలిసింది. సాధారణంగా.. జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు రాష్ట్రపతిపై మోజు పెంచుకుంటారు. ఇది పెద్ద చిక్కు. ఎన్నికలు.. పార్టీల మద్దతు అంతా కావాలి. కానీ, స్థానికంగా రాష్ట్ర స్థాయి నాయకులకు గవర్నర్ గిరీ పెద్ద కష్టం కాదు. ఒక్క నిర్ణయంతో గవర్నర్ అయిపోవచ్చు. కేంద్రంలో పలుకుబడి ఇప్పుడు మెండుగా ఉన్ననేపథ్యంలో చంద్రబాబు ఆదిశగానే యనమలను గవర్నర్గా చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.