వెంకట్రావు కళలను గతంలోనే తీర్చిన టీడీపీ.. అందుకే 'మంత్రి' పదవి ఇవ్వలేదా.?
- గతంలోని టిడిపి ఎంతో న్యాయం చేసింది.
- పార్టీ భవిష్యత్తు కోసం కొత్తవారికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు.!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు తన కింద 24 మంది మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈసారి మంత్రివర్గ కూర్పులో చాలా చాణరత వ్యవహరించారని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూసేద్దామా.
ఆ సీనియర్లే మంత్రులు:
గత మూడుసార్లు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రతిసారి సీనియర్లకే మంత్రి పదవులు అందించారు. ఇందులో వీరికి మాత్రం తప్పకుండా మంత్రి పదవులు ఉండేవి. కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసరావు, పరిటాల సునీత, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి, ఇంకా మరి కొంతమంది నేతలు తప్పనిసరిగా ఆయన మంత్రివర్గ కూర్పులో ఏదో ఒక మంత్రి పదవి పొందేవారు. కానీ నాలుగోసారి చంద్రబాబు సీఎం అయిన తర్వాత వీరందరినీ పక్కన పెట్టి పార్టీ భవిష్యత్తే ప్రథమ ధ్యేయంగా ముందుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. సీనియర్లకు చెక్ పెట్టి జూనియర్లకు అవకాశం ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కళా వెంకట్రావు. ఈయన పార్టీ ఆవిర్భావం నుంచి చంద్రబాబు వెంట ఉన్నారు. అయినా ఆయనకు ఈసారి మంత్రి పదవి ఇవ్వకుండా మరొకరికి మంత్రి పదవి ఇచ్చారు. కళా వెంకట్రావుకు సర్దిచెప్పి ఇంకొకరికి మంత్రి పదవి ఇవ్వడంతో అదికాస్త చర్చనీయంశంగా మారింది. మరి కళా వెంకట్రావుని ఎందుకు పక్కన పెట్టారు. ఆయనకి ఇంకేమైనా పదవులు ఇస్తారా అనేది తెలుసుకుందాం.
మంత్రి పదవికి దూరమైనా కళా.!
కళా వెంకట్రావు టిడిపి ఆవిర్భావం నుంచి ఎన్నో పదవులు అనుభవించారు. చంద్రబాబుతో పాటు సమానంగా ఆయన టిడిపిలో ఉంటూ వచ్చారు.. అలాంటి ఆయన చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ ఇప్పుడు మంత్రి పదవికి దూరం చేసిందని మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన సీనియారిటీ కూడా మంత్రి పదవికి దూరం చేసిందట. అలాంటి కళా వెంకట్రావు ఏ పదవులు అనుభవించారు పార్టీతో ఆయనకున్న బంధం ఏంటి అనేది చూసేద్దాం.
కళా వెంకట్రావు ఎన్టీఆర్ హయాంలో గెలిచినప్పుడు హోం శాఖ పదవిని కట్టబెట్టారు. ఈయన ఉత్తరాంధ్రలో వెనుకబడిన బీసీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి హోం శాఖ మంత్రి ఇచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెందేలా చేశారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభలో కూడా ఓసారి అడుగు పెట్టారు. ఇలా పార్టీలో కళా వెంకట్రావుకు పెద్దపీట వేసినా, టిడిపి పార్టీని వదిలిపెట్టి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. మళ్లీ ఏమనుకున్నారో ఏమో 2014లో తిరిగి మళ్ళీ సొంత గూటికే చేరుకున్నారు. అయినా టిడిపి అధినాయకుడు చంద్రబాబు ఆయనకు ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించడంతోపాటు, తన కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా ఛాన్స్ కల్పించాడు. అంతేకాకుండా కళా వెంకట్రావు మరదలు అయినటువంటి కిమిడి మృణాళినికీ కూడా మంత్రి పదవి అప్పగించారు.