ఏపీ: సామాన్యులు, బడాబాబులు అందరూ బాబుపైనే ఆశలు పెట్టుకున్నారు?
ఇక వీటితో పాటు 18 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని బాబు మాటిచ్చారు. ఇది మాత్రం కొంత ఇబ్బందిగా మారనుంది. ఎందుకంటే.. వీరి సంఖ్య 70 లక్షల వరకు ఉంటుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి మరి. మధ్యతరగతి వర్గాలను పరిశీలిస్తే.. ప్రధానంగా పెట్రోలు ధరలు సహా నిత్యావసారల ధరల తగ్గింపును కోరుకుంటున్న పరిస్థితి. దీనికి అయితే చంద్రబాబు హామీ ఇవ్వలేదు. కానీ, ధరలను పెంచబోమని మాత్రం అన్నారు. ఇక, కీలకమైన.. అభివృద్ధి విషయంలోనూ మధ్యతరగతి చంద్రబాబుపై ఆశలు భారీగానే పెట్టుకుంది.
ఇక మిలియనీర్ల విషయానికివస్తే.. చంద్రబాబుపై వీరి ఆశలు కోకొల్లలుగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా కేంద్రంలో అధికారం పంచుకున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా తెస్తారని.. వీరు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే తద్వారా రాయితీలు పొంది పరిశ్రమలు, ప్రాజెక్టులు పెట్టుకోవచ్చని వారు కలలు కంటున్నారు. అమరావతి రాజధానిని త్వరితగతిన పూర్తి చేస్తే.. తమకు పెట్టుబడులు పెట్టేందుకు మరింత అవకాశం చిక్కుతుందని వారు అనుకుంటున్నారు. అయితే.. ఈరెండింటిలో ప్రత్యేక హోదా విషయం అనేది కొరకరాని కొయ్యలా మారింది. అమరావతి విషయానికి వస్తే మాత్రం మూడేళ్ల పాటు వేచి చూడక తప్పదు. ఇలా ఒక్కొక్క వర్గం ఆశలు ఒక్కో విధంగా ఉన్నాయి. మరి చంద్రబాబు వీరిని ఏరకంగా తృప్తి పరుస్తారు అనేది కాలం నిర్ణయిస్తుంది.