ఎమ్మెల్యే అయ్యాక లోకేష్ చేసిన ఆ పని గ్రాఫ్ అమాంతం పెంచేసిందా...?
- ఉదయం 7 టు రాత్రి 10 వరకు ప్రజా సమస్యల పరిష్కారం
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
టీడీపీ యువ నాయకుడు, విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. గ్రాఫ్ పెరిగిందా? ఆయన చొరవ, చేస్తున్న ప్రయత్నాలు వంటివి.. ఆయనకు మంచి ఇమేజ్ను తెచ్చి పెడుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ప్రారంభించారు. ప్రస్తుతంతన సొంత నియోజకవర్గం మంగళగిరి వరకే దీనిని పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా కూడా.. ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.
గడిచిన రెండు రోజుల్లో నారా లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్లో విశేషంగా ప్రజలు హాజరయ్యారు. వారి సమస్యలు చెప్పుకొన్నారు. కొన్ని సంవత్సరాలుగా తీరని సమస్యలు కొన్ని ఉంటే.. మరికొన్ని మాత్రం వ్యక్తిగతంగా సంబంధించినవి కూడా ఉన్నాయి. దాదాపు ఈ రెండు రోజుల్లోనే రెండు వేల మంది వరకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకొన్నట్టు సమాచారం. అన్ని సమస్యలను ఓపిగా వింటున్న నారా లోకేష్.. వాటికి సంబంధించి పరిష్కారానికి కూడా చొర తీసుకుంటున్నారు.
ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు నారాలోకేష్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నరు. ప్రజల నుంచి వస్తున్న సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లను కూడా వెల్లడిస్తున్నారు. సమస్యలు తీసుకున్న తర్వాత.. సంబంధిత అధికారులతో మాట్లాడే బాధ్యతలను ముఖ్య అధికారులకు అప్పగించి బాధితుల్లో భరోసా నింపుతున్నారు.
ఈ పరిణామాలతో ఇప్పుడు మంగళగిరి వ్యాప్తంగా సమస్య చెప్పుకొంటే పరిష్కారం అవుతుందన్న భరోసా కలుగుతోంది. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా అనేక మంది ఉదయాన్నే.. నారా లోకేష్ నివాసానికి తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన వారికి ఉదయం పూట టీ, టిఫెన్లు ఏర్పాటుచేయాలని నారా లోకేష్ భావిస్తు న్నారు. లేదా.. అన్న క్యాంటీన్ను ఇక్కడ ఏర్పాటు చేయించే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఎలా చూసుకున్నా.. నారా లోకేష్ ప్రయత్నం సూపర్ అనే భావన వ్యక్తం కావడం గమనార్హం.