ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సినీనటుడు, జనసేన పార్టీ నేత హైపర్ ఆది అన్నారు.తాను ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి తాలూకా అని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడారు. కూటమి అనే సినిమా 164 రోజులు ఆడిందని అందుకే ఈ సక్సెస్ మీట్ అని ఆది అన్నారు. కుమారుడు తన మొదటి సంపాదనతో తల్లికి చీర కొనిపెట్టినపుడు, బైక్పై తండ్రిని కూర్చోబెట్టి తీసుకెళ్లినపుడు ఎంత ఆనందం కలుగుతుందో.. పవన్కల్యాణ్ గెలిచినపుడు ప్రతి జనసైనికుడి కళ్లలో అది చూశానన్నారు. ముఖ్యంగా లంకా దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు ఎన్నికల్లో విజయం తర్వాత చిరంజీవి దగ్గరకి పవన్ అలా వెళ్లారన్నారు. అంతకంటే ఎమోషనల్ మూమెంట్ మరొకటి ఉండదని చెప్పారు. మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటారంటూ విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ ఈ దృశ్యంచెంపపెట్టువంటిందన్నారు.
రాజకీయం అనేది బతికి ఉన్నంత కాలం పవన్ కల్యాణ్ అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి విజయాన్ని మీరు చూశారు. పదో తరగతి సోషల్ టెక్స్ట్ బుక్లో రాజుల చరిత్ర గురించి చదివే ఉంటారు. అలాంటి పుస్తకంలో పవన్ కల్యాణ్ గురించి కూడా రాయాలి. ఆయన చరిత్రలో త్యాగాలు, సహాయాలు ఉంటాయి. ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిచాక గర్వం ఉంటుంది. కానీ పవన్లో భయం చూశాను. ఎందుకంటే ప్రజలు తనను ఎన్నుకొని బాధ్యత అప్పగించారు.ఆ బాధ్యతల్ని నిర్వర్తించాలనే భయం ఆయనది. అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం అదృష్టవంతులుగా భావించాలి.