వైసీపీ ఓటమికి మూలం తెలిసింది... బయటకొస్తోన్న నిజాలు...!
- పన్నుల భారంతో జగన్ను దూరం పెట్టేసిన నగర ఓటరు
- రు. 4 వేల ఫించన్ జగన్ను ముంచేసిందా..!
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
గత వైసీపీ సర్కారు ఓటమికి మూలం తెలిసింది. జనాలు ఇప్పుడిప్పుడే తమ అభిప్రాయాలను బయటకు చెబుతున్నారు. ఆన్లైన్ మీడియా ఛానెళ్లు.. ప్రధాన మీడియా కవర్ చేస్తున్న వార్తల్లో ప్రజలు తమ అభి ప్రాయాలు వెల్లడిస్తున్నారు. తమ ఓటును ఎవరికి వేశామనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వెల్లడిస్తున్నారు. ఇక, నగరాలకు వచ్చేసరికి.. మరో రూపంలో ప్రజలు తమ ఓటును ఎవరికి వేశామనేది చెప్పకనే చెబుతు న్నారు. దీంతో వైసీపీ ఓటమికి మూలం ఏంటి? అనే మిలియన్ డాలర్ల ప్రశ్నకు ఆన్సర్ చిక్కేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో తాజాగా కొన్ని మీడియా ఛానెళ్లు చేసిన ఇంటర్వ్యూలో.. ప్రజలు తాము సైకిల్ గుర్తుకు ఓటేశామని చెప్పారు. నిజానికి ఎన్నికలు అయిన తర్వాత.. ఎవరూ చెప్పలేదు. అప్పటి పరిస్థితులను చూసి వారు జంకి ఉంటారు. అయితే, రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా..ప్రజలు తమ మనసులో మాటను పంచుకుంటున్నారు. మెజారిటీ ప్రజలు తమ ఓటును చంద్రబాబుకు వేసినట్టు చెప్పడం గమనార్హం. దీనికి కారణం కూడా చెప్పారు.
తమ పింఛన్లను రూ.4000లకు చేస్తానని చంద్రబాబు చెప్పారని.. దీంతో ఆయనకే ఓటేసినట్టు వెల్లడించా రు. ఇదే సమయంలో జగన్ రూ.3000 ఇచ్చినా.. మళ్లీ పెంచుతారన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించడం మరో విశేషం. అది కూడా.. రూ.250 చొప్పునే పెంచారని.. పెరుగుతున్న ఖర్చులకు అది ఏమూలకూ చాల డం లేదని వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు వైపు మొగ్గు చూపినట్టు తెలిపారు. ఇదేసమయంలో చంద్రబాబుపై తమకు నమ్మకం ఉందని కూడా చెప్పుకొచ్చారు.
ఇక, నగర వాసుల విషయానికి వస్తే.. పెంచిన పన్నులు.. విద్యుత్ చార్జీల భారం ఎక్కువగా ఉందన్నారు. తాము వస్తే.. చార్జీలు పెంచబోమన్న చంద్రబాబు పై విశ్వాసంతోనే ఆయనకు ఓటేసినట్టు సగటు మధ్య తరగతి జీవులు చెప్పడం గమనార్హం. ఇదేసమయంలో కొన్ని పథకాలు పోతాయని తమకు తెలుసునని.. వాటి కంటే కూడా.. తాము చెల్లించే బిల్లులు ఎక్కువగా ఉన్నాయని అందుకే బాబు వైపు నిలిచినట్టు వెల్లడించారు. మొత్తంగా.. ఎన్నికల్లో ఈ రెండు అంశాలు పింఛన్ల పెంపు, ధరల తగ్గింపు సగటు ఓటరును ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది.