సీఎం సీటు దక్కాలంటే: జగన్ తగ్గాలి... ఆలోచన నెగ్గాలి...!
- కేడర్కు అందుబాటులో ఉండాలి
- రాజకీయంగా పట్టున్న వర్గాలకు దగ్గరవ్వాలి
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
సీఎం సీటు పోవడం చాలా ఈజీ. కానీ, దక్కించుకునేందుకు మాత్రం చాలా కష్టపడాలి. ఈ కష్టం విలువ ఏంటో.. మాజీ ముఖ్యమంత్రిగా మారిన జగన్కు తెలియంది కాదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన దరిమిలా జగన్కు కళ్ల ముందు కనిపిస్తున్నది కూడా ఇదే. ఎంతో కష్టపడితే తప్ప.. వచ్చే ఎన్నికల్లోనెగ్గి అధికారం దక్కించుకోవడం అంత ఈజీగా అయితే.. కనిపించడం లేదు. దీనికి ముందుగా జగన్ చేయాల్సింది.. తాను తగ్గడం.. ఆలోచనలను నెగ్గించడం.
మంచో చెడో.. అయిపోయింది. ఐదేళ్లు ప్రజలతో కలుసుకోలేక పోయారు. తానుచేస్తున్నది సరైందనే భావనతో ఉన్నారు. రాజధానిని కాదన్నా.. మూడు రాజధానులు కావాలన్నా.. చంద్రబాబు ను జైల్లో పెట్టినా .. టీడీపీ నేతలపై దాడులు జరిగినా.. ఎస్సీ, ఎస్టీలపై అరాచకాలు చోటు చేసుకున్నా.. వినబడనట్టుగానే.. కనబడనట్టుగానే.. తనకు సంబంధం లేదన్నట్టుగానేజగన్ వ్యవహరించారు. ఇవి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలోనే జగన్ను అధికారానికి దూరం చేశాయి.
ఇప్పుడుజగన్ చేయాల్సింది.. తన ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రజలకు వివరించా లి. అయిందేదో అయిపోయింది. ఇక, నుంచి అయినా.. కేడర్కు అందుబాటులో ఉండాలి. రాచరిక మనస్తత్వాన్ని విడనాడాలి. అందరితోనూ కలివిడిగా ఉండడం.. మేధావుల సూచనలు పాటించడం వంటివి జగన్ ముందున్న ప్రధాన లక్ష్యాలు. ఈ సమయంలోనే జగన్.. తనను తాను తగ్గించుకునేలా వ్యవహరించాలి. ఇలా చేయకపోతే.. ఇబ్బందులు కొనసాగుతాయి.
మరో కీలక విషయం.. రాజకీయాల్లో సామాజిక వర్గాల దన్ను చాలా ముఖ్యం. ఈ క్రమంలో కూడా వ్యూహాలు ఉంటాయి. రాజకీయంగా ఓట్లు తెచ్చే సామాజిక వర్గాలు.. ఆర్థికంగా బలాన్నిచ్చే సామాజిక వర్గాలు.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకునేలా.. చంద్రబాబు వ్యవహరించారు. ఇదే.. ఆయనకు తాజా ఎన్నికల్లో బాగా ఉపయోగపడింది. ఇక, ఈ విషయంలో జగన్ విఫలమయ్యారు. కీలక సామాజిక వర్గాన్ని ఆయన వదులుకున్నారు. ఓట్లు వస్తాయంటూ.. మరో సామాజిక వర్గాలను పట్టుకున్నారు. కానీ, ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఆలోచనా విధానం మార్చుకుని.. సమయానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందనడంలో సందేహం లేదు.