శివప్రసాద్... టాలీవుడ్ మంత్రి... ఎంపీ... సెన్షేషనల్ రికార్డులు...!
- వైసీపీ మాజీ మంత్రి రోజాకు సినీ గురువు
- చంద్రబాబు బాల్య స్నేహితుడిగా పొలిటికల్ ఎంట్రీ
( చిత్తూరు - ఇండియా హెరాల్డ్ )
నారమల్లి శివప్రసాద్ ఈ పేరు చెపితే తెలుగు సినీ రంగంలో సినీ అభిమానులు.. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆయన ఏ పని చేసినా ఓ సంచలనం.. ఓ వైవిధ్యం ఉంటుంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శివప్రసాద్ బాల్య స్నేహితుడు. శివప్రసాద్ కు సాహిత్యం, కళలు, సినిమా నటన ఇష్టమైన విషయాలు. చిన్నప్పటి నుంచి నాటకంపై ఉన్న ఆసక్తితో అనేక నాటకాల్లో నటించాడు. ఆ తర్వాత సినిమారంగానికి వచ్చి పలు చిత్రాలలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించాడు. చిరంజీవి ఖైదీ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా నటించారు. ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగాను.. విలన్గానూ నటించి మెప్పించారు. డేంజర్ సినిమాలో విలన్గా నటించి ఆ నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.
ఇక వైసీపీలో నిన్నటి వరకు మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజాకు శివ ప్రసాద్ సినీ రంగంలో గురువు కావడం విశేషం. ఇక చంద్రబాబు స్నేహితుడు కావడంతో ఆయన ప్రోత్సాహంతో 1999లో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో ఓడిపోయినా చిత్తూరు పార్లమెంటు సీటు ఎస్సీలకు రిజర్వ్ కావడంతో వరుసగా రెండుసార్లు 2009 - 2014 ఎన్నికల్లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. అలా పదేళ్ల పాటు ఆయన పార్లమెంటులో తెలుగు ప్రజల సమస్యలపై గళం వినిపించారు.
ఎంబీబీఎస్ చదివిన ఆయన అటు నటుడిగా ఇండస్ట్రీలో రాణించి.. ఇటు రాజకీయాల్లోకి వచ్చి ఓ సారి ఎమ్మెల్యేగా.. ఆంధ్రప్రదేశ్ మాజీ సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేయడంతో పాటు రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2019లో చిత్తూరు నుంచే ఎంపీగా ఓడిపోయారు. ఆ తర్వాత కిడ్నీ వ్యాధితో మృతిచెందారు. ఇక రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతున్న టైంలో 2013లో ఆయన పార్లమెంటు వేదికగా ప్రతి రోజు ఓ వేషంతో సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేసి అందరిని ఆకట్టుకున్నారు.