వైఎస్ జయంతి సాక్షిగా అన్న .. చెల్లి మధ్య కొత్త గొడవ...?
- షర్మిల జోరుకు జగన్ అడ్డకట్ట వేయకపోతే తారుమారే
( కడప - ఇండియా హెరాల్డ్ )
ప్రజానేతగా గుర్తింపు పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి.. వచ్చే నెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఆయన జయంతి వివాదం కాలేదు. అటు కుమార్తె షర్మిల, ఇటు కుమారుడు జగన్లు ఎవరికి వారుగా ఇడుపుల పాయ వెళ్లి.. ఈ జయంతిని నిర్వహించుకునేవారు. కానీ, ఇప్పుడు తొలిసారి వైఎస్ జయంతిని రాజకీయంగా మార్చుకునే ప్రయత్నం షర్మిల వైపు నుంచి జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా ఉన్న షర్మిల.. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో విజయం దక్కించుకుంటామని.. తాను తప్పకుండా కడప నుంచి విజయం సాధిస్తానని చెప్పిన ఆమె.. కొంగు పట్టారు. కన్నీరు పెట్టారు. అయినా.. కూడా ప్రజలు కరుణించలేదు. అయితే.. ఆశాజనక విషయం ఏంటంటే.. 1 శాతంగా ఉన్న ఓటు బ్యాంకును 2.8 శాతానికి మాత్రం తీసుకువెళ్లారు. కీలక నియోజకవర్గాల్లో వైసీపీని గెలవకుండా నిలువరించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జయంతిని ఆమె రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఆమె నిమగ్నమయ్యారు. అయితే.. మరోవైపు..జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఘోర ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అయితే.. జయంతి వేడుకలను నిర్వహించ డం ద్వారా.. తనకు ఎదురు నిలవాలని భావిస్తున్న షర్మిలను ఆయన ఎలా అడ్డుకుంటారనేది చూడాలి.
అంతేకాదు.. ఇప్పుడు.. కనుక వైఎస్ జయంతిని ఘనంగా చేయకపోతే.. షర్మిలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్టే అవుతుంది. పైగా.. వారసత్వ పోరు కోసం ఎదురు చూస్తూ..త నను వారసురాలిగా ప్రొజెక్టు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న షర్మిలకు అడ్డుకట్ట వేయకపోతే.. మున్ముందు.. పార్టీలో ఉన్న వారు కూడా.. పార్టీ మారే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని వైసీపీ అధినేత ఎలా ఎదుర్కొంటారో చూడాలి.