వైసిపి: గుణపాఠంతో లోకేష్, చంద్రబాబు నేర్చుకున్నదేమిటంటే..?
టిడిపి ఎమ్మెల్యేలు , ఎంపీలతో చంద్రబాబు నాయుడు, లోకేష్ సమయం దొరికితే చాలు తరచూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు బిజీగా ఉంటే లోకేష్ ఏదో ఒక సందర్భంలో తమ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు , ప్రజాప్రతినిధులతో మాట్లాడేందుకు సమయాన్ని కేటాయిస్తూ ఉండడం గమనార్హం.. ముఖ్యంగా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు, నాయకులు చెప్పింది వినడమే కాదు సమస్యల పరిష్కారానికి కూడా వీరిద్దరూ చొరవ చూపుతున్నారని తెలుస్తోంది.. అలాగే టెలీ కాన్ఫరెన్స్ లో, బూత్ లెవెల్ టిడిపి నాయకులతో కూడా నేరుగా చంద్రబాబు లోకేష్ మాట్లాడుతున్నారట. వారిలో జోష్ నింపుతూ ప్రజల కోసం పనిచేయాలని చెబుతున్నారట. పైగా ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను, నాయకులని జగన్ గాలికి వదిలేశారు.
ఏనాడు మండల స్థాయి పార్టీ సమావేశాన్ని కూడా నిర్వహించిన దాఖలాలు లేవు.. పైగా జగన్ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు బటన్ నొక్కడం లో లీనమై ప్రజలంతా తన వెంట ఉన్నారని మాయలో గడిపారు.. ఏ పార్టీకైనా కేడరే బలం అనే వాస్తవాన్ని విస్మరించిన పాపానికి జగన్ భారీ మూల్యం చెల్లించారు అందుకే ఆ తప్పులు మళ్ళీ చేయకుండా చంద్రబాబు, లోకేష్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఊరికే మాట్లాడడమే కాకుండా వారికి ఏదైనా ఆర్థిక ప్రయోజనాలు కలిగించేలా చర్యలు తీసుకుంటే టిడిపి మరింత బలపడే అవకాశం ఉందని శ్రేణులు చెబుతున్నాయి.