ప్రత్యేక హోదా.. ప్రత్యేక బాధ : రాజకీయ సమరంలో నలిగిపోయిన డిమాండ్..!
- పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా అని చెప్పి చట్టంలో చేర్చని మన్మోహన్
- రాజకీయ సుడిగుండంలో పడి నలిగిపోయిన ఏపీ ప్రత్యేక హోదా
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు ఏపీలో కొంత మేరకు చర్చవస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఈవిషయాన్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. కేంద్రాన్ని సపోర్టు చేస్తున్న టీడీపీ, జనసేనలు ప్రత్యేక హోదాపై డిమాండ్ చేయాలని ఆమె కోరుతున్నారు. ఇక, గతంలో 2019 ఎన్నికల సమయంలోనూ.. అప్పటి ముఖ్యమంత్రి జగన్.. కూడా.. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచి.. ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పారు. కానీ, తీసుకురాలేదు. దీనికి ఆయన.. కేంద్రంలో బీజేపీ సర్కారుకు బలమైన మెజారిటీ ఉందని.. అందుకే సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు.
కట్ చేస్తే.. 2014లో జరిగిన రాష్ట్ర విభజనకు ముందు పార్లమెంటులో అసలు ఈ విషయాన్ని ప్రస్తావించింది బీజేపీనే. అప్పటి రాజ్యసభ సభ్యుడు.. ప్రస్తుత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఎవరికీ ప్రత్యేకహోదా అనేది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. ఇక, వెంకయ్య డిమాండ్కు కాంగ్రెస్ నాయకులు కూడా.. వంత పాడారు. దీంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. రాజ్యసభలోనే.. ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని మాట మాత్రంగా చెప్పారు.
కానీ, దీనిని విభజన చట్టంలో చేర్చలేక పోయారు. ఫలితంగా.. చట్ట బద్ధంగా ప్రత్యేక హోదాను తెచ్చుకునే అవకాశం ఏపీ కోల్పో యింది. నిజానికి చెప్పాలంటే.. ప్రత్యేక రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా తర్వాత వచ్చిన మోడీ సర్కారు అమలు చేయకపోవడం తెలిసిందే. అయితే.. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చి ఉంటే.. ఆ డిమాండ్ వేరేగా ఉండేదని అంటారు రాజకీయ పండితులు. కానీ.. అప్పటికి ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు.. తలకో విధంగా స్పందించడం.. అసలు విభజన జరుగుతుందా? అనే సందేహాలు ముసురుకోవడంతో విభజన చట్టంపై లోతుగా చర్చించే అవకాశం కోల్పోయారు.
కట్ చేస్తే.. 2014 లో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2017 తర్వాత కాలంలో కేంద్రంలోని మోడీ సర్కారుతో కయ్యం పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా విషయంలో దీనికి ముందు ఆయన కేంద్రం పెద్దల ముందు వద్దని తలూపిన ఆయన.. తర్వాత కాలంలో విపక్ష వైసీపీ దూకుడుతో మరోసారి ప్రత్యేక హోదా పాట అందుకున్నారు. కేంద్రంలోనూ తన ఎంపీలతో నిరసన చేయించారు. కానీ, ఫలితం మాత్రం దక్కలేదు. ఆ తర్వాత.. వచ్చిన జగన్ హోదా తెస్తానని చెప్పినా.. ఆయన కూడా ఎక్కడా బలమైన వ్యూహంతో ముందుకు సాగింది లేదు. సో.. ఎలా చూసుకున్నా.. రాజకీయ సుడి గుండంలో ఏపీ హోదా.. ఇప్పటికీ నలుగుతూనే ఉంది.