ప్రత్యేక హోదా.. ప్రత్యేక బాధ : బిహార్ గళ మెత్తింది.. బాబు మెడకు చుట్టుకుంది..!
- హోదా కోసం బాబు ఫైట్ చేయకపోతే ఏపీలో ఇబ్బందే
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
ప్రత్యేక హోదా విషయం.. అందరూ మరిచిపోయారని అనుకున్న సమయంలో అనూహ్యంగా ఉత్తరాది రాష్ట్రమైన బిహార్ తాజాగా గళం విప్పింది. ఎన్డీయే కూటమిలో ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఇప్పుడు ఈ హోదా కోసం పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న మోడీకి బలమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో హోదా గురించి మాట్లాడినా.. ఆయన పట్టించుకోలే దు. దీంతో ఇప్పుడు నితీష్ తన మద్దతుతో మోడీ కేంద్రంలో అధికారంలో కి వచ్చారన్న విషయాన్ని గమనించి.. పట్టు బిగిస్తు న్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ.. అసెంబ్లీలోనే తాజాగా తీర్మానం చేశారు.
చిత్రం ఏంటంటే.. సాధారణంగా పాలకపక్షం తీర్మానాలను, నిర్ణయాలను ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కానీ, బిహార్లో ఇప్పుడు జరిగిన ప్రత్యేక హోదా తీర్మానంపై మాత్రం ప్రతిపక్షాలు సైతం.. ముక్తకంఠంతో మద్దతు తెలిపాయి. దీంతో బిహార్ నుంచి గళం బలంగా వినిపించే పరిస్థితి వచ్చింది. నిజానికి బిహార్కు ప్రత్యేక హోదా డిమాండ్.. ఇప్పటిది కాదు.. 2001 నుంచి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయి.. జార్ఖండ్ ఏర్పడింది. ఏపీ మాదిరిగానే ఆదాయం వచ్చే భూములు, వనరులు అన్నీ కూడా.. బీహార్కు దూరమై.. జార్ఖండ్కు దగ్గరయ్యాయి.
ఈ క్రమంలోనే 2001లోనే అప్పటి వాజపేయి సర్కారు ముందు ప్రత్యేక హోదా డిమాండ్ తెరమీదికి వచ్చింది. అప్పటి నుంచి ఇది కలగానే ఉంది. కట్ చేస్తే.. ఇప్పుడు బిహారంలో వెల్లువెత్తిన ప్రత్యేక హోదా గళం..ఏపీ వరకు చేరింది. ఏపీలో చంద్రబాబుకు కూడా .. ఈ డిమాండ్ చుట్టుకుంది. చంద్రబాబు కూడా.. కేంద్రంలోని మోడీసర్కారుకు మద్దతిస్తున్నారు. తన 16 మంది ఎంపీలను కూడా.. కేంద్రంలోని మోడీకి సపోర్టుగా ఉంచారు. రెండు మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. దీంతో ఇప్పుడు మోడీ ప్రభుత్వం అటు నితీష్, ఇటు చంద్రబాబు పైనే ఆధారపడింది. దీంతో వీరిద్దరినీ కాదని మోడీ తీసుకునే నిర్ణయాలు, చేసే కార్యక్రమాలు అంటూ ఉండవనేది ఒక వర్గం చెబుతున్నమాట.
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కూడా హోదా డిమాండ్ను తెరమీదికి తెచ్చారని అంటున్నారు. ఇక,ఇప్పుడు చంద్రబాబు కూడా హోదా కోసం ఎందుకు ప్రయత్నించరనే చర్చ, ప్రశ్న కూడా తెరమీదికి వచ్చాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రంలో మోడీ సర్కారు ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ఎందుకు డిమాండ్ చేయరన్నది ఆమె వాదన. ఇది మున్ముందు మరింత పెరిగి.. సెగ బెట్టినా ఆశ్చర్యం లేదు. అదేసమయంలో గతంలో ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ కల్యాణ్ కూడా.. మోడీ సర్కారులో భాగమే. తన ఇద్దరు ఎంపీలను కూడా మోడీ చెంతకే చేర్చారు. సో.. ఆయనకు కూడా సెగ పెడుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.