ప్రత్యేక హోదా.. ప్రత్యేక బాధ : ఆ ఇద్దరి ఒత్తిడికి తలొగ్గి మోడీ హోదా ఇస్తారా ?
- హోదా మాత్రం మోడీ ఇవ్వడు.. బాబు, నితీష్ను వదిలేసుకుంటాడు..!
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
ప్రత్యేక హోదా విషయం.. ఇప్పుడు జాతీయస్థాయిలో సెగ పెడుతోంది. ఇప్పుడిప్పుడే.. బిహార్లో ఈ వ్యవహారం.. కాకమీద ఉంది . ఇక, ప్రత్యేక హోదాను కోరుతున్న మరో రాష్ట్రం ఒడిసాలో బీజేపీనే ఉంది. ఇక్కడకూడా.. సుదీర్ఘకాలంగా ప్రజలు ఉద్యమాలు చేశారు. గతంలో నవీన్ పట్నాయక్ కూడా.. ఇక్కడ ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టారు. డెలిగేషన్ బృందాన్ని కూడా ఆయన తీసుకువెళ్లారు. మరోవైపు.. తమ రాష్ట్రంలో నీలగిరి ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. తమిళనాడు కూడా సుదీర్ఘ కాలంగా పోరాడుతోంది. ఇక, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.
ఇలా.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ మరో చిత్రమైన పరిస్థితి ఉంది. ఒకవైపు కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు.. ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ.. ఉద్యమాలు చేస్తున్నాయి. వీటిలో తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, జార్ఖండ్ వంటివి ఉండడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని.. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక, బిహార్కు హోదా వద్దని.. జార్ఖండ్, మహారాష్ట్రలు కోరుతున్నాయి. ఇలా.. పీటముడులు చాలానే ఉన్నాయి. ఇన్ని వివాదాల మధ్య అసలు మోడీ ఇస్తారా? అనేది ప్రశ్న.
బిహార్తో పాటు.. ఏపీ కూడా.. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే.. మోడీ ఏమేరకు తలొగ్గుతారనేది ప్రశ్న. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రత్యేక హోదా డిమాండ్ను లేవనెత్తిన బిహార్.. మోడీకి మద్దతుగా 12 మంది ఎంపీలను కేంద్రంలో ఉంచింది. ఇక, ఏపీ కూడా రేపు ప్రత్యేక హోదా కోసం పట్టుబడితే.. అప్పుడు బాబు కీలకం అవుతారు. బాబు కూడా.. 16 మంది ఎంపీలతో కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. వీరిద్దరి ఉద్దేశం కూడా.. మోడీకి తమ సపోర్టు కనుక లేకపోతే.. కేంద్రంలో ఆయన సర్కారు కుప్పకూలుతుందనే. ఇది వాస్తవమే. మేజిక్ ఫిగర్ ప్రకారం చేసుకున్నా.. 273 మంది ఎంపీలు ఉంటే తప్ప. కేంద్రంలో మోడీ సర్కారు మనజాలదు.
ఇలా చూసుకుంటే.. బీజేపీకి ఒంటరిగి దక్కిన స్థానాలు.. 250. సో.. మిగిలిన 23 స్థానాలను ఇతర పార్టీలతో కలుపుకొని ఆయన సర్కారును ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీరు తప్పుకొంటే.. ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకే హోదా కోసం.. బిహార్ పట్టుబడుతోంది. ఏపీలో చంద్రబాబు ఈ విషయంపై ఇంకా దృష్టి పెట్టలేదు. సో.. ఈ విషయంలో మోడీ కూడా.. ముందుగానే ప్లాన్ బీ.. రెండీ చేసుకున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. తనతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి 293 మందితో ఇప్పుడు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు.
సో.. బాబు, నితీష్లు కనుక ఘర్షణకు దిగి జారుకున్నా.. ఆయన బలం తగ్గేది 16+12 = 28. సో.. 293లో 28 మందిని తీసేస్తే.. 265 మంది మిగులుతారు. అప్పుడు మెజారిటీ కోసం కావాల్సింది 8 మంది. ఈ ఎనిమిది మందిలో వైసీపీకి నలుగురు ఉన్నారు. అలాగే.. ఒడిసాలోనూ.. ప్రాంతీయ పార్టీల బలం 3-4 దాకా ఉంది. ఇలా.. చిన్నా చితకా పార్టీలను కలుపుకొని వెళ్తారే తప్ప.. ఆయన ప్రత్యేక హోదా ఇవ్వబోరని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారోచూడాలి.