కాంగ్రెస్ పార్టీలో.. సోనియా, ప్రియాంక సమక్షంలో వైయస్ విజయలక్ష్మి..?
వైఎస్ఆర్ మరణానంతరం ఆయన వారసులు రాజకీయంగా చీలిపోయారు. తనయుడు జగన్ వైసీపీ పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తున్నారు. ఇటు కుమార్తె షర్మిలారెడ్డి తెలంగాణలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి రాజకీయంగా చేతులు కాల్చుకుని.. తిరిగి కాంగ్రెస్లో చేరి గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు షర్మిల మాత్రమే ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 8వ తేదీన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను షర్మిల వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిరథ మహారధులు అందరిని ఆహ్వానిస్తున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అలాగే సోనియాగాంధీ, ప్రియాంకలను సైతం ఆమె ఆహ్వానిస్తున్నారు. మరి వారిద్దరూ వస్తారా..? లేదా..? ప్రియాంక మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా..? అన్నది చూడాలి. అయితే ఇదే కాంగ్రెస్ వేదిక మీదకు వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి కూడా రానున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో విజయలక్ష్మి కొడుకు జగన్ ను కాదని.. కుమార్తె షర్మిలను గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అతిరథ మహారధులు కనిపించే వేదిక మీద విజయలక్ష్మి కూడా కనిపిస్తే రాజకీయంగా ఆమె తిరిగి కాంగ్రెస్లో యాక్టివ్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.