ఘోరంగా ట్రోలింగ్ అవుతున్న జగన్ వీడియో.. ఆయన వ్యాఖ్యలు బెడిసికొట్టాయా?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్లలో రాజకీయ పార్టీ నేతల మధ్య వైరుధ్యాలు భగ్గుమన్నాయి. ఎక్కడ చూసినా కొట్లాటలు, పోలీసుల మోహరింపులు కనిపించాయి. ఆ సమయంలో పోలింగ్ జరుగుతుండగా వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఓ పోలింగ్ బూత్లోకి దూసుకెళ్లారు. పోలింగ్ బూత్లోని ఓ ఈవీఎంను నేలకు కొట్టి ధ్వంసం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయనపై అధికారులు కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. గతంలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయడంపై అందులో పాము దూరి ఉంటుందని వైసీపీ నేతలు కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇది విపరీతంగా ట్రోలింగ్ అయింది. అదే తరహాలో తాజాగా జగన్ కూడా వ్యాఖ్యానించారు. తమకు అనుకూలంగా పోలింగ్ జరగలేదని, అందుకే తమ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారని అన్నారు. అనుకూలంగా పోలింగ్ జరగకపోతే ఈవీఎంలు ధ్వంసం చేయడమేంటని, దానిని జగన్ సమర్ధించడం దారుణమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పిన్నెల్లిపై తప్పుడు కేసులు బనాయించారని జగన్ పేర్కొనడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఈవీఎంలు ధ్వంసం చేయడం నేరం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంలు ధ్వంసం చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి సమర్ధించేలా వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. జగన్పై ట్రోలింగ్ అవుతున్న ఈ వీడియో రికార్డులు సృష్టించడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు.