తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలకు ముందు బిజెపి పార్టీ అంటే కనీసం డిపాజిట్లు కూడా వచ్చేవి కావు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తప్ప బిజెపి అంటే ఎవరికీ తెలిసి ఉండేది కాదు. అలాంటి బిజెపి కొద్దికొద్దిగా పుంజుకుంటూ 2018 ఎలక్షన్స్ లో కాస్త బోనీ కొట్టింది. 2023 ఎలక్షన్స్ వచ్చేసరికి దాని పట్టు మరింత చూపించింది. 2024 పార్లమెంటు ఎలక్షన్స్ లో కూడా 8 స్థానాల్లో గెలిచి తనకి ఎదురు లేదు అనిపించుకుంది. అలాంటి బిజెపి తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి స్థాయిలో పుంజుకోవడానికి ప్రధాన కారకుడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని చెప్పవచ్చు. ఈయన సారథ్యంలోనే బిజెపి ఓ రేవుకు వచ్చింది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరారో, అప్పటినుంచి గ్రూపు రాజకీయాలు మొదలైపోయాయి.
అప్పుడే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అప్పటినుంచి తాత్కాలికంగా కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా కేటాయించారు. ఇదే తరుణంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా బిజెపి 8 స్థానాలు సాధించింది. పార్లమెంటు ఎలక్షన్స్ లో కూడా 8 స్థానాలు సాధించి తన పట్టును నిలుపుకుంది. ఇదే తరుణంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి బండి సంజయ్ కి మరియు కిషన్ రెడ్డికి కేంద్రం మంత్రి పదవులు కట్టబెట్టి పక్కకు నెట్టేశారు. కీలకమైన రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఎవరికి ఇవ్వాలని ఆలోచనలో పడ్డారు. దీనికోసం బిజెపి నుంచి ప్రధానంగా ఈటల రాజేందర్, డీకే అరుణ , రాజాసింగ్, రఘునందన్ రావు వంటి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బిజెపి మదిలో ఉన్నది మాత్రం ఈటెల రాజేందర్ అని తెలుస్తోంది.
మధ్యకాలంలోనే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి అద్భుత మెజారిటీతో గెలుపొందిన ఈటల రాజేందర్ రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నేత. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆయనకు ఉన్నటువంటి సంబంధాలతో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తారని కొంతమంది భావిస్తున్నారు. అంతేకాదు డీకే అరుణకు కూడా ఈటెల రాజేందర్ ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. అలాగే మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు కూడా అధ్యక్ష పదవి కోసం ఆశ పడుతున్నారు. నేను పార్టీ పుట్టినప్పటినుంచి దీంట్లోనే ఉన్నాను. నాకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. రాజాసింగ్ కూడా, పార్టీని పూర్వకాలం నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం నాకు ఇవ్వాలని ఆయన అంటున్నారు. ఈ విధంగా అధిష్టానం మదిలో కూడా ఈ ముగ్గురు, నలుగురు నేతలే ఉండడంతో ఎవరికి ఇస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.