వైఎస్సార్@75: బిడ్డల మధ్య వైరం.. పెద్దాయన ఆత్మఘోషించేనా.?
- తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు..
- సొంత బిడ్డలకే అంగట్లో బొమ్మలా తయారయ్యాడు..
- పెద్దాయన ఆత్మ శాంతించేనా.?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పేదోన్ని అడిగినా ఈ పెద్దాయన పేరు తప్పక వినిపిస్తుంది. ఆయన చేసింది రాజకీయమే అయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవంగా మారాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరు నాయకులను ఒప్పించి పేద ప్రజలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు. అలాంటి పెద్దాయన ఈనాడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన తీసుకొచ్చినటు వంటి రియంబర్స్ మెంట్ వల్ల ఎంతోమంది పేదలు చదువుకొని ఉద్యోగాలు చేస్తు ఆనందంగా జీవిస్తున్నారు. ఆ ఆనందంలో పెద్దాయన ఉన్నాడు.. ఆయన అందించిన ఆరోగ్య శ్రీ వల్ల కొన ఊపిరితో ఆసుపత్రికి వెళ్లి బ్రతికి వచ్చిన వారు ఎందరో ఉన్నారు.. వారి గుండె చప్పుల్లో పెద్దాయన ఉన్నాడు.. అంబులెన్స్ సైరన్ మోతలో ఉన్నాడు.
కోట్లాదిమందికి బాట చూపించారు ఈ పెద్దాయన. కానీ తన ఇద్దరు బిడ్డలకు సరైన బాట చూపించలేకపోయారని చెప్పవచ్చు. పెద్దాయన రాజకీయ వారసత్వం కోసం కొడుకు జగన్మోహన్ రెడ్డి,బిడ్డ షర్మిల ప్రతిరోజు కొట్టుకుంటున్నారు. ఓకే తల్లి కడుపున పుట్టిన వీరిద్దరూ పెద్దాయనను రెండు భాగాలుగా చేసి ఆత్మ ఘోషించేలా చేస్తున్నారు. ఎవరి రాజకీయాలకు వారు రాజశేఖర్ రెడ్డిని వాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప ఆయన ఆశయ సాధనలో ఎవరు ముందడుగు వేయడం లేదని చెప్పవచ్చు. పేదవాడి మన్నన పొందాలి అంటే తండ్రిని వాడుకోవడం కాదు, తండ్రి అనుకున్న ఆశయాలను నెరవేర్చి ఆయన బాటలో కలిసికట్టుగా నడవాలి. తల్లి విజయమ్మ ఆశీస్సులతో ముందుకు కదలాలి. కానీ పెద్దాయన బిడ్డలు మాత్రం తల్లి విజయమ్మకు కన్నీరు తెప్పించి ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకు వస్తావా అన్నట్టు కన్న తల్లినే ఆవేదనకు గురి చేస్తున్నారు. ఈ విధంగా పెద్దాయన ఆత్మ శాంతి లేకుండా చేయడంలో సొంత బిడ్డలే పాలుపంచుకుంటూ రాజకీయాల కోసం కొట్లాడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ఇద్దరు బిడ్డలు కలిసి తండ్రి ఆశయ సాధన కోసం కొట్లాడితే పెద్దాయన ఆత్మ శాంతిస్తుందని రాజశేఖర్ రెడ్డి గురించి తెలిసిన సన్నిహితులు అంటున్నారు.