కేసీఆర్ కు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి చేశాననే అపోహ ఆయనకు ఉంటుంది. అంతే కాదు ఆయన కింది స్థాయి లీడర్లు కూడా కేసీఆర్ అంటే ఒక దేవుడిలా కొలిచారు. రాజ్యాంగపరమైన విలువలు అన్ని తుంగలో తొక్కి పాలన చేశారు. అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాం, అసలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేశామని మాటలు మాట్లాడుతూ చివరికి రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు. మరి అభివృద్ధి చెందిన రాష్ట్రంలో అప్పులు ఎలా అయ్యాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రంలో పేదలకు ఇండ్లు ఎందుకు రాలేదు. యువతకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కేసీఆర్ పాలన జరిగినన్ని రోజులు కొన్ని పథకాలు బాగానే ఉన్నా, ఎక్కువ పథకాలు మాత్రం ధనికుడి కడుపే నింపాయి. ఈ విధంగా ధనికులకు, దొరలకు, రెడ్లకు పెద్దపీట వేసినటువంటి కేసీఆర్ చివరికి సాధారణ ప్రజల నుంచి తీవ్రమైన పరాభవాన్ని పొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు దారుణంగా ఓడిపోయారు.
అసలు ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో కేసీఆర్ కు అన్నీ ఒకేసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓవైపు గారాబంగా చూసుకునే బిడ్డ అరెస్టై జైలుకు వెళ్లడం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, పార్లమెంటులో కనీసం ఒక్క సీట్ అయినా దక్కించుకోలేకపోవడం ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇలా సమస్యల గండంలో బీఆర్ఎస్ పార్టీ చిక్కుకున్న తరుణంలోనే మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు పార్టీలో ఉన్నటువంటి కీలక లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ గడప తొక్కారు. ఇలాగే చూస్తూ ఉన్న లీడర్లంతా కాంగ్రెస్ లేదా బిజెపిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక అంతా వెళ్లిన తర్వాత పార్టీ పూర్తిగా లేకుండా అవుతుందనే భయంలో పడ్డారు కేసీఆర్ కేటీఆర్.
దీనికి తోడు కవిత జైలు నుంచి బయటకు రాకపోవడం, అలాగే వీరిపై కొన్ని ఆరోపణలు ఉండడం, కేటీఆర్, కేసీఆర్ కూడా అరెస్ట్ అవుతారని వార్తలు వినిపించడంతో బీఆర్ఎస్ అధినాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎలాగైనా పార్టీని కాపాడుకోవాలి, వారు సేఫ్ గా ఉండాలి అంటే బిజెపితో దోస్తాన్ చేయాలని చూస్తున్నారు. బిజెపి చెంతన ఉంటే కవిత జైలు నుంచి బయటకు వస్తుంది. వీరిపై కూడా ఇలాంటి కేసులు పడవు. అలాగే పార్టీ కూటమిలా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో గెలవచ్చు అనే ఆశతో కేసీఆర్ ఉన్నారట. దీనికోసం కేటీఆర్ ఇప్పటికే బిజెపి పెద్దలతో చర్చలు జరిపారట. కానీ బిజెపి పెద్దలు మాత్రం బీఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేయడానికి అసలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయినా పట్టు విడవని విక్రమార్కుడిలా కేసీఆర్, కేటీఆర్ పార్టీని బిజెపిలో విలీనం చేయడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా వీరి భయం చూస్తే మాత్రం తప్పక ఎన్నో తప్పులు చేశారని అర్థం చేసుకోవచ్చు. మరి చూడాలి బిఆర్ ఎస్ పరిస్థితి రానురాను ఏమవుతుందో ముందు ముందు తెలుస్తుంది.