కూటమి పాలన @ 30 : బాబు కొత్త సినిమా అదుర్స్.. కల్కి రేంజ్ బ్లాక్బస్టర్..!
- జగన్లా కాకుండా మీడియాకు దగ్గరగా.. మీడియాతోనే..
- ఆర్థిక, గనుల శాఖ, రెవెన్యూ శాఖల్లో అప్పుడే కీలక మార్పులు
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
నెలరోజుల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. సర్కారు ఏర్పడి ఈరోజుకి నెల రోజులు గడిచిందిజ నిజానికి ఈ నెలరోజుల కాలంలో చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి చేసిన ప్రయోగాలు పెద్దగా లేకపోయినా.. మార్పులు అయితే కనిపించాయి. ప్రధానంగా వ్యవస్థలను గాడిలో పెడతాను అని ఎన్నికలకు ముందు చెప్పారు. దాన్ని అమలు చేసేందుకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా గత వైసిపి హయాంలో కొన్ని వ్యవస్థలు అవినీతి అక్రమాలతో కూరుకుపోయాయని అప్పట్లో చంద్రబాబు విమర్శలు చేశారు.
ఆయా శాఖలన్నిటినీ ఆయన ఇప్పుడు సంస్కరించారు. అంటే ఉన్నతాధికారులను మార్చటం, పోలీసు వ్యవస్థని పటిష్టం చేయటంతో పాటు ఆర్థిక, గనుల శాఖ, రెవెన్యూ శాఖ వంటి కీలకమైనటు నాలుగు రంగాల్లోనూ సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి కొంత మంది అధికారులు తీసుకొచ్చారు. ముద్దాడ రవిచంద్ర, అదే విధంగా బాలకృష్ణ వంటి సీనియర్ అధికారులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఏపీలో నియమించడం ద్వారా రాష్ట్ర వ్యవస్థలను చక్కదిద్దేందుకు తాను కంకణం కట్టుకున్నానన్న సంకేతాలను చంద్రబాబు స్పష్టంగా పంపించారు.
ఇక ఏవైతే గత 2014 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిందో ఆయా ప్రాజెక్టుల అభివృద్ధి విషయంలో తాము వడివడిగా అడుగులు వేస్తున్నామనే సంకేతాలను కూడా చంద్రబాబు నాయుడు బలంగా ప్రజల్లోకి పంపించగలిగారు. ఒకటి పోలవరం, రెండు అమరావతి. ఈ రెండు ప్రాజెక్టులను రెండు కళ్ళుగా భావిస్తానని ఎన్నికలకు ముందు చెప్పారు. ఏపీ అంటే అమరావతి. పోలవరం అని నినాదాలు చేశారు. ఆ నినాదాలను నిజం చేస్తూ ఆయన అధికారం చేపట్టిన నెల రోజుల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ గా పోలవరం తర్వాత అమరావతి ప్రాజెక్టుల్లో సందర్శించారు.
అదేవిధంగా సంబంధిత శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఇదొక రికార్డ్ గానే చెప్పాలి. ఎందుకంటే కేవలం నెల రోజుల్లోనే ఈ రెండు కీలకమైన ప్రాజెక్టులను గల్లి నుంచి ఢిల్లీ వరకు తీసుకువెళ్లి ఆయా ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడం, కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయం పైన చంద్రబాబు దృష్టి పెట్టడం వంటివి ఆశించ దగిన పరిణామాలు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది... అనే మాటని సాకారం చేసుకునే దిశగా ఇప్పటికే ఉన్న మంచి పేరు నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు.
ఇక మూడో విషయం సంక్షేమం. ఈ విషయానికి వస్తే ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పారో వాటిలో మెజారిటీ పథకాల్లో కొన్ని కీలకమైనవి ఉన్నాయి. వాటిలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అత్యంత కీలకమైంది. ఆర్థిక వ్యవస్థతో ముడిపడి వ్యవహారం కావడంతో దీనిపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. అదేవిధంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటు విషయంలోనూ ఒక కమిటీని వేశారు. మాతృ వందనం పేరుతో పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు 15 వేల రూపాయలు చొప్పున ఇస్తామన్న విషయంలోనూ అధ్యయనం చేయడానికి అధికారులతో ఒక కమిటీని నియమించారు.
అంటే ఒకరకంగా అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని కూడా సమాంతరంగా ముందుకు తీసుకు వెళ్తూ తనదైన మార్కును చూపించేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నించారని ఈ నెలరోజుల పాలనను గమనిస్తే అర్థమవుతుంది. బాబు నెల రోజుల కొత్త సినిమా ప్రభాస్ తాజా కల్కి రేంజ్ బ్లాక్బస్టర్ లెక్కే అనుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి అంటే మీడియాకు చెరువగా ఉండాలి. ప్రజలకు దగ్గరగా ఉండాలి. అనే సంకేతాన్ని కూడా చంద్రబాబు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీడియాకు దూరంగా ఉంటే ఇప్పుడు చంద్రబాబు ఈ తాను ఏం చేసినా ఎక్కడ ఉన్నా మీడియాకు చేరువుగా ఉన్నారు. ప్రజల సమస్యలను ప్రస్తావించటం అనేది ఈ నెలలో గమనించాల్సిన విషయం.