తెలుగు రాష్ట్రాల సంబంధాలు: మనుషులు కలిసినా మనసులు డౌటే..?
- బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్ అని రేవంత్ విమర్శ
- ఏపీకి భవనాలు ఇవ్వనన్న రేవంత్... బాబు భద్రాచలంలో ఐదూళ్లు ఇస్తాడా ?
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మనుషులైతే కలుసుకున్నారు. కానీ, మనసులు కలవలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు హైదరాబాదులోని ప్రజాభవన్లో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. దశాబ్ద కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరువురు నాయకులు భావించారు. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత చొరవ తీసుకున్న చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నం చేశారు. నిజానికి చెప్పాలంటే గడిచిన దశాబ్ద కాలంలో ఇట్లాంటి సృద్భావ వాతావరణంలో ఎలాంటి సమావేశాలు జరగలేదు. తాజాగా జరిగిన సమావేశం ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక మంచి సంకేతాలను ఇచ్చిందనే చెప్పాలి. అయితే సమావేశం వరకు బాగా నడిచింది. ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఆశలు రేకెత్తాయి. కానీ, ఈ సమావేశం జరిగిన మరుసటి రోజున కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల తర్వాత ఈ రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం కావడం అంత సులభం అయితే కాదని స్పష్టమైంది. వాస్తవానికి ఇరువురు ముఖ్యమంత్రుల భేటీలో అంతా సానుకూలంగా ఉందని ఇరు రాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకునేందు కు కష్టపడుతున్నాయని, ఇష్టపడుతున్నాయని కూడా మంత్రులు చెప్పుకొచ్చారు. దీంతో నిజమే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు కనీసం ఇప్పటికైనా పరిష్కారం అవుతాయని అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా రేవంత్ రెడ్డి మంగళగిరిలో చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ ఆశలు నిరాశగా మారాయి.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విపక్ష నేత పవన్ కళ్యాణ్లు.. ప్రధాని మోడీకి అనుకూలమైన నాయకులని, మోడీ ఆదేశాల ప్రకారం వాళ్ళు పనిచేస్తారని చెప్పారు. బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్ అని వ్యాఖ్యానించారు. నిజానికి ఇది ఎన్నికల సమయం కాదు. అయినా ఆయన ఇలా బిజెపి అంటే బాబు-జగన్-పవన్ అని వ్యాఖ్యానించి తద్వారా మోడీకి ఈ ముగ్గురిని అంట కట్టడం, ఈ ముగ్గురు మోడీకి అనుకూలమైన వ్యక్తులని చెప్పారు.
అంతేకాదు.. ఇక్కడ మోడీనే పరిపాలిస్తున్నారని చెప్పడం ద్వారా తన మనసులో ఉన్న మాటను రేవంత్రెడ్డి వెల్లడించినట్లు అయింది. తద్వారా రాజకీయంగా ఏపీకి సహకరించే అవకాశం అయితే కనిపించడం లేదు .ఈ పరిణామాలు గమనించిన తర్వాత దీనికి ఒకరోజు ముందు జరిగిన సమావేశంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని, సానుకూల ఫలితం వస్తుందని, రెండు తెలుగు రాష్ట్రాలు అడుగులు వేస్తాయని భావించిన వారు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లాంటి వాదం వినిపించిన తర్వాత మళ్ళీ ఏపీతో ముడిపడిన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు? అనేది ప్రశ్న.
ఏపీతో ఏ విధంగా ఆయన ముందుకు సాగుతారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎట్లా చూసుకున్నా తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత మనుషులు కలిసారే తప్ప, మనసులు కలవలేదు అనే సంకేతం అయితే స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళింది. దీనిని బట్టి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు ఇప్పట్లో పరిష్కారం అవుతాయా ?కావా? అనే సందేహాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. అయితే.. ఇక్కడ సానుకూల వాతావరణం ఏంటంటే.. చంద్రబాబు మాత్రం రియాక్ట్ కాకపోవడమే. రేవంత్ అన్ని మాటలు అన్నా.. టీడీపీని సైతం ఆయన కంట్రోల్ చేయగలిగారు. మరి ఆయన సంయమనం ఏమేరకు సాయ పడుతుందో చూడాలి.