బడ్జెట్ 24: ఈ బడ్జెట్ చాలా ప్రత్యేకమైంది.. ఎందుకంటే?
మోదీ ప్రభుత్వం ముచ్చటగా 3వ సారి కొలువు తీరిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే వరుసగా ఏడోసారి బడ్జెట్ సమర్పించనున్నారు నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి బడ్జెట్లో కొన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశం మెండుగా కనిపిస్తోంది. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే కొన్ని సెక్టార్లకు భారీ కేటాయింపులు ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. ఇంధన రంగం, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఎలాంటి కేటాయింపులు, రాయితీలు ఉంటాయనేదానిపై ఆసక్తి నెలకొంది.
అదేవిధంగా MSMEలకు చేయూత ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ట్యాక్స్పేయర్లు, మహిళలు, యువతకు ఇపుడు ప్రాధాన్యత ఇస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా 80 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక సిద్దం చేసిన నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ట్యాక్స్ స్లాబ్స్లో మార్పులు ఉండొచ్చని నిపుణులు అనుకుంటున్నారు. ప్రస్తుతం 12 నుంచి 15 లక్షలు మధ్య ఆదాయం ఉంటే 20 శాతం పన్ను ఉంది. ఈ స్లాబ్లో పన్ను 10 శాతానికి తగ్గిస్తారా? లేదంటే మరేమైనా మార్పులు చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్టాండర్డ్ డిడక్షన్స్ విషయంలో ఎలాంటి మార్పులు చేస్తారనేదాని కోసం వేతన జీవులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా విషయాలపైన మరి కొన్ని గంటల్లో క్లారిటీ రాబోతుంది.