గుంటూరు వైసీపీలో నెక్ట్స్ వికెట్ ఎవరు .. ?
- ఫస్ట్ వికెట్ గా మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి అవుట్
- అదే బాటలో మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ లు
- పార్టీ పై నమ్మకం లేక నేతల ఆందోళన
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఈ యేడాది మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తాము తిరుగులేని ఘన విజయం సాధించి తాము అధికారంలోకి వస్తామని వైసీపీ వాళ్లు గట్టి ప్రయత్నాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సైతం మరోసారి అధికారం తమదే అన్న ధీమాతో ఉన్నారు. కానీ కట్ చేస్తే పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చివరకు ప్రతి పక్ష హోదా కూడా పార్టీకి రాలేదు.. జగన్ కు ప్రతిపక్ష హోదా నేత అవకాశం కూడా దక్కలేదు.
ఇక ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది .. వైసీపీ కేవలం11 సీట్లకే పరిమితం కావడంతో ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ? అన్న సందేహాలు సొంత పార్టీ నేతల్లోనే కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ లో ఉండలేమన్న నిర్ణయానికి వచ్చిన వారందరు ఇప్పుడు పార్టీ మారిపోతున్నారు. ముందు ఏ పార్టీలోకి వెళతాం అన్నది తర్వాత సంగతి కాని వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గుంటూరు వైసీపీ లో గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ధర్ రావు పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఆయన 2019లో టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైసీపీ లో చేరారు. ఈ ఎన్నికల్లో జగన్ గిరికి కాకుండా చిలకలూరిపేట నుంచి తీసుకు వచ్చి మంత్రిగా ఉన్న రజనీకి సీటు ఇవ్వగా ఓడిపోయారు.
ఈ క్రమంలోనే గిరి పార్టీలో ఇమడ లేకపోయారు. ఆయన తన ప్రాథమిక సభ్యత్వం తో పాటు నగర పార్టీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. ఆయన టీడీపీ లోకి వీలు లేకపోతే జనసేన లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు గిరి బాటలోనే మరి కొందరు వైసీపీ నేతలు ఉన్నారు.