తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్న ప్రాంతీయ పార్టీలు.. నిధులు రావట్లేదుగా!
సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే పథకాల అమలుకు సంబంధించి నిధుల సమస్యలు ఉండవు. అదే సమయంలో ప్రముఖ కంపెనీలు సైతం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన మినహా రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేవనే సంగతి తెలిసిందే.
తెలంగాణలో కొన్ని నెలల క్రితం వరకు టీ.ఆర్.ఎస్(బీ.ఆర్.ఎస్) అధికారంలో ఉంది. ఆ సమయంలో టీ.ఆర్.ఎస్ కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యత లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అయింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో బీజేపీ బడ్జెట్ విషయంలో తెలంగాణకు ఒకింత అన్యాయం చేసిన సంగతి తెలిసిందే.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఈ పరిస్థితి కొంతమేర మారి ఉండేది. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో సత్సంబంధాలను కలిగి ఉంటూ కొత్త కంపెనీల దిశగా అడుగులు వేస్తూ ప్రజల మెప్పు పొందేలా పరిపాలన సాగిస్తే మాత్రమే ఈ పరిస్థితులు మారే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు సైతం ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం తమ వంతు సహాయసహకారాలు అందిస్తే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.