ఆ నేత‌కు చెక్ పెట్టేందుకే ఆర్‌. కృష్ణ‌య్య‌ను తెర‌మీద‌కు తెచ్చారా..?

RAMAKRISHNA S.S.
బిసి ఉద్యమ సంఘం నేత ఆర్‌ కృష్ణయ్య ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియటం లేదు. ఆయన గత మూడు ఎన్నికలకు మూడు పార్టీలు మారారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి.. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ కండువా కప్పుకుని మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మరీ విచిత్రంగా 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి వచ్చి వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు.

కట్ చేస్తే ఇప్పుడు వైసీపీతో పాటు.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసేసారు. కృష్ణయ్య తదుపరి అడుగులు ఎటువైపు పడుతున్నాయి.. ఆయన తాను ప్రకటించినట్టుగానే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా.. లేదా.. బిజెపిలో చేరుతున్నారా అన్నదానపై చర్చలు నడుస్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన సమయంలోనే.. కృష్ణయ్య రాజీనామా పై స్పందిస్తూ తాను వైసీపీనీ ఎట్టి పరిస్థితుల్లో విడనని చెప్పి నెల రోజులు కూడా కాకుండానే జగన్‌కు బిగ్ హ్యాండ్ ఇచ్చేశారు. తాజా సమాచారం ప్రకారం కృష్ణయ్య బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరిగాయని.. కాషాయ కండువా కప్పుకునేందుకు లైన్‌ క్లియర్ అయిందని రాజ్యసభ ఇస్తామన్న హామీతోనే ఆయన వైసీపీతో పాటు.. ఆ పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ పదవిని కూడా వదులుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణ బీజేపీలో బీసీ నేతల గోల ఎక్కువైంది అన్న చర్చ జరుగుతోంది. ఆర్‌ కృష్ణయ్యను బిజెపిలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపించడం వెనక ఒక చ‌ర్చ కూడా నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ, బీసీ నినాదం వినిపిస్తోంది. దీనిని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రయత్నిస్తున్నారు అని సీనియర్లు గుర్రుగా ఉన్నారట. తెలంగాణ బీజేపీ బీసీ నేతలు బండి సంజయ్, ఈటెల వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే ఈటెలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ వర్గం ఆర్‌ కృష్ణయ్యను తెరమీదకు తెచ్చింది అనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: