వైసీపీలో స‌భ్య‌త్వం ఉండ‌దా... ఎమ్మెల్యే అదిరిపోయే సెటైర్‌...!

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు జోరుగా నడుస్తోంది. ఐదేళ్లపాటు ఎన్నో కష్టనష్టాలు అనుభవించి ఈ ఎడాది జరిగిన ఎన్నికలలో పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పార్టీ సభ్యత్వ నమోదును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ తమ నియోజకవర్గాలలో వేలాది సభ్యత్వాలను నమోదు చేసి.. పార్టీని పటిష్టం చేసుకోవాలని తమకు ఎదురులేకుండా చేసుకోవాలని చూస్తున్నారు. అయితే వైసీపీలో సభ్యత్వ నమోదు ఎప్పుడు ఇంత హడావుడి ఉండదు. దీనిపై గత ఐదేళ్లు వైసిపి ఎమ్మెల్యేగా ఉండి.. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే.. వైసీపీలో సభ్యత్వం లేదు.. అసలు అటువంటి విధానమే నాకు తెలియదు.. అంటూ ఎద్దేవా చేశారు.

ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ఎన్టీఆర్.. కృష్ణ జిల్లా, మైలవరం ఎమ్మెల్యే.. వసంత కృష్ణ ప్రసాద్ కావడం విశేషం. ఎన్టీఆర్ జిల్లా.. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. లక్ష రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీలో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. గొల్లపూడి మెయిన్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీలో సభ్యత్వం లేదు. అసలు అలాంటి విధానం ఉందన్న విషయమే నాకు తెలియదు.. అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా శాశ్వత సభ్యత్వం తీసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వైసీపీలో సభ్యత్వం అనేది గతంలో లేదు. నేను తీసుకోలేదు. అసలు అలాంటి విధానం ఉందని నాకు తెలియదు అని వ్యాఖ్యానించారు. ఇక దేవినేని ఉమా లాంటి పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రిని కాదని సైతం చంద్రబాబు.. వసంత కృష్ణ ప్రసాద్‌కు మైలవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: